
మాజీ భారత క్రికెటర్, ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్ ఖాన్ జట్టులో తన పాత్రను వెల్లడించాడు. అతను ఆటలో వ్యూహాల గురించి.. ఆటగాళ్లలో మానసిక పరిణతి గురించి క్రికెటర్లకు ఎలా సహాయం చేస్తాడో కూడా తెలిపాడు. జహీర్ 2019 ఐపీఎల్కి ముందు ముంబై టీమ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. 2009, 2010, 2014లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున కూడా జహీర్ ఖాన్ ఐపీఎల్లో ఆడాడు. అతను క్రికెట్ డైరెక్టర్గా అడుగుపెట్టినప్పటి నుండి ముంబై రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. అయితే ఈ ఏడాది మాత్రం ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.
'పరస్పర సంభాషణల ద్వారా క్రికెట్లో చాలా నేర్చుకుంటాం. సంభాషణలు, ఎక్స్పీరియన్స్ కలగలిస్తే నేర్చుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాగే ఇతర ప్లేయర్లను కూడా తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి ప్లేయర్కు ఓ స్టోరీ ఉంటుంది. నేను ఎప్పుడూ ప్లేయర్లు ఎక్కడి నుంచి వచ్చారో.. వారు వారి ఆట పట్ల ఎలాంటి విధానాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను' అని ఫ్రాంచైజీ పోస్ట్ చేసిన వీడియోలో జహీర్ ఖాన్ చెప్పాడు. సంభాషణల ద్వారా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు. కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ.. ప్లేయర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. ఆట గురించి ఆలోచించడం కూడా అవసరమని చెప్పాడు. కొన్నిసార్లు ఒక ప్లేయర్ కెరీర్లో వివిధ దశలలో భిన్న రీతిలో ఆలోచిస్తారని, వారు తమ మనస్తత్వాన్ని అంచనా వేసి అవసరమైతే వారి మానసిక స్థితిని మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నాడు. తాను కూడా తన ప్లేయర్ల పట్ల అలాగే వ్యవహరిస్తానని తెలిపాడు.
జహీర్ ఖాన్ ఢిల్లీ జట్టుకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఐపీఎల్లో ఆడాడు. అతను ఐపీఎల్లో సుదీర్ఘంగా ఆడి మంచి అనుభవాన్ని పొందాడు. ఆ అనుభవాన్ని ఉపయోగించి ముంబై ప్లేయర్లను మానసికంగా, ఆటపరంగా మెరుగు చేయడంలో ప్రోత్సహిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో మాత్రం ముంబై మొదటి నుంచి వైఫల్యాలతో సతమతమైంది. ఇటీవల ఎనిమిది వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించి గెలుపు ఖాతా తెరిచింది. ముంబై జట్టు మే 6న బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇక తాము తమ విజయాలను కొనసాగిస్తామని జహీర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.