

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్కప్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడాలనుకునే వారి జాబితాలో తాజాగా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ చేరాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని కంటే మెరుగ్గా ఆడేవారు మరెవ్వరూ లేరని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటే అతడి అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. వికెట్ల వెనుక చురుగ్గా రాణించడంతో పాటు క్లిష్టమైన సందర్భాల్లో యువ బౌలర్లకు ధోని తగిన సలహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాంటి ధోని జట్టులో ఉంటే కచ్చితంగా టీమిండియా కప్ను సాధిస్తుందని జహీర్ ధీమా వ్యక్తంచేశాడు.
గతేడాది పేలవ ప్రదర్శనను కనబర్చిన ధోని ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ దక్కించుకోవడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు.
చివరి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు విజయాల్ని అందించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు. ఆసీస్ గడ్డపై మూడు వన్డేల సిరిస్లో ధోని 193 పరుగులు సాధించి ఫామ్లోకి వచ్చాడు. దీంతో 2019 క్రికెట్ వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో ధోనీకి కూడా చోటు లభిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.