
కోహ్లీ మూడు ఫార్మట్లకు కింగ్:
తాజాగా జహీర్ అబ్బాస్ 'టెలిగ్రాఫ్'తో మాట్లాడుతూ... 'ఆట పరంగా స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలు సమఉజ్జీలు. అయితే టెస్టుల్లో స్మిత్ అత్యుత్తమమని అతని రికార్డులు చెపుతున్నాయి. అతను ఆడే ప్రతి సిరీస్లోనూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. కానీ.. కోహ్లీ అన్ని ఫార్మట్లలో తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచశేణి అత్యుత్తమ బ్యాట్స్మన్ అనిపించుకోవాలంటే.. ఒక్క ఫార్మట్లో మెరుగ్గా రాణిస్తే సరిపోదు. మూడు ఫార్మట్లలోనూ బాగా రాణించాలి. ఆ విషయంలో కోహ్లీ మెరుగ్గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ సైతం మూడు ఫార్మట్లలో రాణిస్తున్నాడు. కానీ.. నిలకడ లోపించింది' అని అన్నాడు.

కోహ్లీ రన్ మెషీన్ కాదు:
గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను చూస్తే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని అర్థమవుతుంది. ఇక కోహ్లీని 'రన్ మెషీన్' అనకూడదు. ఎందుకంటే.. మెషీన్లు కొన్ని సార్లు రిపేర్కు వచ్చి పనిచేయవు. కానీ.. కోహ్లీ పరుగుల దాహానికి అలుపంటూ ఉండదు. ప్రస్తుతం కోహ్లీకి సమాంతరమైన బ్యాట్స్మన్ ఎవరూ లేరు. భారత జట్టు చాలా క్రికెట్ ఆడుతుంది. కోహ్లీ వంటి అగ్రశ్రేణి ఆటగాడు టీమిండియా విజయాలలో భాగం. ఎన్ని పరుగులు చేసినా.. కోహ్లీ విసుగు చెందడు. ఎందుకంటే.. అది అతని వృత్తి. ఆటపై అతనికి అంత అంకితభావం ఉంది' అని అబ్బాస్ పేర్కొన్నాడు.

చాలా మంది కోహ్లీలు వస్తారు:
'విరాట్ కోహ్లీలోని ఆటపట్ల నిబద్దత, అంకితభావంప్రస్తుతం కొంతమంది యువ క్రికెటర్లలో చూస్తున్నాను. త్వరలో చాలా మంది కోహ్లీలు క్రికెట్ ఆటలోకి వస్తారని అనుకుంటున్నా. పాకిస్తాన్ యువ బ్యాట్స్మన్ బాబర్ అజమ్ కూడా మెరుగైన బ్యాట్స్మన్. అద్భుతంగా ఆడుతున్నాడు. అతడి నుంచి మరిన్ని రికార్డులను ఆశించవచ్చు. ఇప్పటికే అతన్ని కోహ్లీతో పోల్చుతున్నారు' అని 14 టెస్ట్ మ్యాచ్లలో పాకిస్థాన్కు నాయకత్వం వహించిన అబ్బాస్ వివరించాడు.

సెంచరీలు, పరుగులలో పోటీ:
స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్టులలో సెంచరీలు చేయడంలో పోటీ పడుతున్నారు. 73 టెస్ట్ మ్యాచ్లలో స్మిత్ 26 సెంచరీలు చేయగా.. 86 టెస్ట్ మ్యాచ్ల్లో కోహ్లీ 27 సెంచరీలు చేసాడు. స్మిత్ 55.3 సగటుతో 7227 పరుగులు చేయగా.. కోహ్లీ 57.7 సగటుతో 7240 పరుగులు చేసాడు. ఇద్దరూ సెంచరీలు, పరుగులలో పోటీ పడుతున్నారు.


Click it and Unblock the Notifications












