IND vs PAK: క్రికెట్ లోకంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు(ఫిబ్రవరి 15) కొలంబోలో జరగనున్న ఈ కీలక మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ జహీర్ అబ్బాస్ ఇరు దేశాల మధ్య ప్రస్తుత సంబంధాల గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయాల నీడలో క్రికెట్.. జహీర్ అసహనం
క్రికెట్ను రాజకీయాల నుంచి వేరుగా చూడాలని జహీర్ అబ్బాస్ గట్టిగా కోరారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రీడలపై ప్రభావం చూపడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. "నా దృష్టిలో క్రికెట్ ముఖ్యం, రాజకీయం కాదు. నేను రాజకీయాల్లో పాల్గొనను. నా ఏకైక లక్ష్యం క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడం" అని ఆయన స్పష్టం చేశారు. క్రీడా మైదానంలో పోటీ ఉండాలి కానీ, అది దేశాల మధ్య వైషమ్యాలకు వేదిక కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

అప్పట్లో చైనీస్ డిన్నర్లు.. అపురూప స్నేహాలు
తమ కాలంలో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య ఉన్న ఆత్మీయతను జహీర్ అబ్బాస్ గుర్తు చేసుకున్నారు. "మేము మ్యాచ్ ముగిసిన తర్వాత కలిసి రెస్టారెంట్లకు వెళ్లేవాళ్ళం. కలిసి చైనీస్ వంటకాలను ఆస్వాదించేవాళ్లం. మైదానంలో ఎంత తీవ్రమైన పోటీ ఉన్నా, బయటకు రాగానే మేమంతా మంచి స్నేహితులం" అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆట కోసమే మైదానంలో పోరాడేవారమని, వ్యక్తిగత ద్వేషాలకు తావుండేది కాదని ఆయన నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు.
హ్యాండ్షేక్ వివాదంపై సునిశిత విమర్శ
ఇటీవలి కాలంలో భారత్-పాక్ ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోవడానికి కూడా వెనుకాడటంపై జహీర్ అబ్బాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "కరచాలనం చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటి? అది స్నేహానికి, క్రీడా స్ఫూర్తికి గుర్తు. ఎవరైనా గెలవనివ్వండి, కానీ చివర్లో చేతులు కలుపుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇది ఒక ఆట మాత్రమే, యుద్ధం కాదు" అని ఆయన హితవు పలికారు. ఆట ముగిశాక గౌరవించుకోవడం కనీస ధర్మమని గుర్తు చేశారు.
నేటి పోరుపై విశ్లేషణ: భారత్దే పైచేయి!
నేటి మ్యాచ్ గురించి విశ్లేషిస్తూ.. ప్రస్తుతం కాగితంపై టీమిండియా చాలా బలంగా కనిపిస్తోందని జహీర్ అబ్బాస్ అంగీకరించారు. అయితే టీ20 క్రికెట్లో ఏ క్షణంలోనైనా ఫలితం మారిపోవచ్చని హెచ్చరించారు. "భారత్ మెరుగైన జట్టుగా ఉంది, కానీ టీ20లో ఏ చిన్న తప్పిదమైనా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఒత్తిడిని ఎవరు సమర్థవంతంగా తట్టుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు" అని ఆయన విశ్లేషించారు. అలాగే పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ప్రతిభను అభినందిస్తూనే, అంతిమంగా బ్యాటర్ల ప్రదర్శనే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.