వైట్వాష్ అయినందుకు బాధలేదు:
మ్యాచ్ అనంతరం యుజువేంద్ర చహల్ మాట్లాడుతూ... ' గత ఐదేళ్లుగా టీమిండియా నిలకడగా ఆడుతోంది. జట్టులోని ఆటగాళ్లు అందరూ మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఈ సిరీస్ ఓటమి నాలుగోదో ఐదోదో. ప్రతి మ్యాచ్ను ఎవరూ గెలవలేరు. మేం టీ20 సిరీస్ గెలిచాం. వన్డే సిరీస్ ఓడాం. వైట్వాష్ అయినందుకు బాధేమీలేదు. దీనిపై మరీ ఆందోళన చెందడం లేదు. మళ్లీ పుంజుకుంటాం' అని ధీమా వ్యక్తం చేసాడు.
న్యూజిలాండ్లో ఆడటం సులభం కాదు:
'ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ యువకులు. ఈ సిరీసే వారికి మొదటిది. కెరీర్ ఆరంభంలోనే న్యూజిలాండ్లో ఆడటం అంత సులభం కాదు. న్యూజిలాండ్ పిచ్లు ఆటగాళ్లను పరిక్షిస్తాయి. ఇక్కడ ఓపిక చాలా అవసరం. ఇది కేవలం ఒక సిరీస్. మేం టీ20 సిరీస్ను తొలిసారి 5-0తో ఇక్కడ గెలిచాం. అది మాకు సానుకూల అంశం. వన్డే సిరీస్లో కూడా మేము బాగానే రాణించాం. అయితే కివీస్ మాకంటే మెరుగ్గా ఆడింది' అని చహల్ అన్నాడు.
కివీస్ మాకన్నా బాగా ఆడింది:
'యువకుల్లో ఆత్మవిశ్వాసం మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నా. శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్ వయసు తక్కువే అయినా.. ఎంతో పరిణతితో ఆడుతున్నారు. పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటున్నారు. స్పిన్నర్లు దాడి చేస్తుంటే.. మధ్య ఓవర్లో బ్యాటింగ్ చేయడం సులభం కాదు. కొన్నిసార్లు రాహుల్ టాప్ ఆర్డర్లో ఆడాడు. జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడుతున్నాడు. ఇది జట్టుకు లాభించే అంశం. ఈ సిరీస్లో కివీస్ మాకన్నా బాగా ఆడింది. వారిని అభినందించి తీరాల్సిందే. పది సిరీస్లో ఒకసారి ఫీల్డింగ్ బాగుండదు. ఆ సిరీస్ ఇదే అయింది' అని చహల్ చెప్పుకొచ్చాడు.
చహల్ మూడు వికెట్లు:
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్సులు 2)తో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 9) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్ బెన్నెట్ 4 వికెట్లు తీసాడు. 297 పరుగుల లక్ష్యంను కివీస్ 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్టిన్ గప్టిల్ (46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (103 బంతుల్లో 80: 9 ఫోర్లు), కొలిన్ డి గ్రాండ్హోమ్ (28 బంతుల్లో 58: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్ చహల్ మూడు వికెట్లు తీసాడు.