అదిరే ఆరంభం:
రెండో టీ20లో రిషభ్ పంత్ బ్యాటింగ్, కీపింగ్లో మరోసారి విఫలమయి వార్తల్లో నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాకు ఓపెనర్లు లిటన్ దాస్ (29), మహ్మద్ నయీమ్ (36) అదిరే ఆరంభం ఇచ్చారు. ఈ జోడి వరుస బౌండరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 5 ఓవర్లకే 40కి పైగా పరుగులు చేసింది. ఈ సమయంలో ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ చాహల్ను రంగంలోకి దించాడు.
పంత్ తొందరపాటు:
ఆరో ఓవర్లో చాహల్ వేసిన మూడో బంతిని లిటన్ దాస్ క్రీజు వదిలి ముందుకువచ్చి ఆడాలని ప్రయత్నించాడు. పంత్ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో లిటన్ పెవిలియన్ బాటపట్టాడు. అయితే ఆ బంతిని చెక్ చేసిన థర్డ్అంపైర్.. నాటౌట్గా ప్రకటించాడు. పంత్ బంతి అందుకునేటప్పుడు చేతులు వికెట్ల మీద ఉండడంతో బంతిని నోబాల్గా ప్రకటించాడు. దీంతో లిటన్ స్టంపౌట్ నుంచి తప్పించుకున్నాడు.
పంత్పై ఎలాంటి కోపం లేదు:
మ్యాచ్ అనంతరం పంత్ స్టంపింగ్ తప్పిదంపై చాహల్ మాట్లాడుతూ ... 'మేమంతా జట్టులో సహచరులం. ఒక్కోసారి నేను కూడా క్యాచ్లు వదిలేస్తా. ఆటగాళ్లు ఎవరూ కావాలని క్యాచ్లు, స్టంపులు వదిలేయరు. తప్పిదాలు ఆటలో సహజమే కాబట్టి పంత్పై ఎలాంటి కోపం లేదు. అదంతా మా దురదృష్టం' అని పేర్కొన్నాడు. చహల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
తడి బంతితో ప్రాక్టీస్ చేశా:
'పవర్ప్లే, డెత్ ఓవర్లలలో బౌలింగ్ చేయడంతో ఆటగాళ్లలో మరింత విశ్వాసం పెరుగుతుంది. ఇది రానున్న మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన చేయడానికి దోహదపడుతుంది. జట్టుకు దూరంగా ఉన్నప్పుడు తడి బంతితో ప్రాక్టీస్ చేశా. అది ఇప్పుడు ఉపయోగపడింది. తేమ ఉన్నా.. నాపై ఆ ప్రభావం చూపలేదు. బ్యాట్స్మెన్ ఎలా ఆడాలనుకుంటున్నాడనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేస్తా' అని చాహల్ తెలిపాడు.
మండిపడుతున్న అభిమానులు:
ప్రస్తుతం పంత్పై అభిమానులు మండిపడుతున్నారు. ఐసీసీ నిబంధనలపై పంత్కు కనీస అవగాహన లేకపోతే ఎలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పంత్.. ఎంఎస్ ధోనీని అనుకరించడానికి ప్రయత్నించొద్దు అని ఈ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కీపర్ గిల్ క్రిస్ట్ సూచించాడు. ధోనీలా చేసేందుకు చూస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని హెచ్చరించిన విషయం తెలిసిందే.