
హైదరాబాద్: ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు టోర్నీలో విశేష ప్రతిభ ప్రదర్శించిన చాహల్ ర్యాంకింగ్స్లో 12 స్థానాలు మెరుగుపరచుకున్నాడు. మరో భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్కూడా గణనీయంగా తన ర్యాంకింగ్ను మెరుగుపరచుకున్నాడు.
సోమవారం విడుదల చేసిన తాజా జాబితాలో లెగ్ స్పిన్నర్ చాహల్ 12 స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్లోకి చేరుకున్నాడు. కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్ల (706)ను కూడా సమకూర్చుకున్నాడు. సుందర్ (496 పాయింట్లు) 151 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ ర్యాంక్లోకి వచ్చాడు.
ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఎక్కువగా పవర్ప్లేలో బౌలింగ్ చేసిన సుందర్ 5.70, చాహల్ 6.45 ఎకానమీతో ఆకట్టుకున్నారు. జైదేవ్ ఉనాద్కట్ (435 పాయింట్లు), శార్దూల్ ఠాకూర్ (358 పాయింట్లు) సంయుక్తంగా వరుసగా 52, 76వ ర్యాంక్ల్లో కొనసాగుతున్నారు.
ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్నిందించిన దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 126వ స్థానం నుంచి 95వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ 8వ ర్యాంక్లో ఉండగా, లోకేశ్ రాహుల్ 12వ, రోహిత్ శర్మ 13వ, శిఖర్ ధవన్ 17వ ర్యాంక్ల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ 124 రేటింగ్ పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా చెరో 126 పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి.