Chahal-Dhanashree:భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ 18 నెలలుగా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ విడాకుల కేసు తుది విచారణ ఫిబ్రవరి 20న(గురువారం) బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగింది. ఆ సమయంలో చాహల్, ధనశ్రీలు కోర్టుకు హాజరయ్యారు. చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత ఆ జంట అధికారికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. విడాకుల తర్వాత యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీకి రూ.60 కోట్ల భరణం చెల్లించాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. తర్వాత అది నిజం కాదని తేలింది.
అంతా అబద్ధమే..:ధనశ్రీ తరఫు న్యాయవాది
ధనశ్రీ వర్మ తరఫు న్యాయవాది అదితి మోహని మాట్లాడుతూ.. రూ.60 కోట్ల భరణం వార్తలను అబద్ధమని తేల్చి చెప్పారు. ఈ గణాంకాలు నిరాధారమైనవని తెలిపారు. దీనిపై వార్తలను ప్రచురించే ముందు మీడియా వాస్తవాలను తనిఖీ చేయాలని చెప్పుకొచ్చారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని.. చాలా తప్పుదారి పట్టించే విషయాలు వ్యాప్తి చెందుతున్నందున.. నివేదించే ముందు మీడియా ఒకసారి తనిఖీ చేయాలన్నారు. రూ.60 కోట్ల భరణం అంటూ ఫేక్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనశ్రీ వర్మను దారుణంగా ట్రోల్ చేశారు. కొందరు ధనశ్రీ వర్మను 'అవకాశవాది', 'గోల్డ్ డిగ్గర్' అంటూ కామెంట్లు చేశారు.

రూ.60 కోట్ల భరణం.. ధనశ్రీ కుటుంబం ఏం చెప్పిందంటే?
ఇంతలో ధనశ్రీ కుటుంబ సభ్యులలో ఒకరు మాట్లాడుతూ.. భరణం గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందడం పట్ల తాము చాలా విచారంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని.. ఇంత మొత్తం ఎప్పుడూ అడగలేదని.. డిమాండ్ చేయలేదు లేదా అందించలేదని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని.. వాటిలో నిజం లేదని కొట్టిపారేశారు. నిజం తెలియకుండా సమాచారాన్ని ప్రచురించడం బాధ్యతారహిత చర్య అంటూ పేర్కొన్నారు. దీని కారణంగా కేవలం చాహల్, ధనశ్రీలను మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగుతున్నారని అన్నారు. దీని వల్ల హాని మాత్రమే జరుగుతుందన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు మీడియా సంయమనం పాటించి వాస్తవాలను తనిఖీ చేయాలని కోరుతున్నామన్నారు. ప్రతి ఒక్కరి గోప్యతను కూడా గౌరవించాలని తాము అభ్యర్థిస్తున్నామన్నారు.