ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. తమ జనరేషన్ లో అతడే బెస్ట్ ప్లేయర్ అని కొనియాడాడు. అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు.
తీవ్ర విమర్శలు..
విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ లో లేక విమర్శలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై మంచి రికార్డ్ ఉన్న విరాట్.. రీసెంట్ గా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత రంజీలోనూ దారుణంగా నిరాశ పరిచాడు. ఈ క్రమంలోనే అతడిని తప్పించాలని, క్రికెట్ కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాలన్న వాదనలు కూడా వినిపించాయి. అయినప్పటికీ అతడిని ఇటీవలే ఇంగ్లాండ్ పై సిరీస్ లో ఆడించారు. అప్పుడు కూడా గాయంతో తొలి వన్డే నుంచి తప్పుకున్న అతడు రెండో వన్డేలోనూ విఫలమయ్యాడు.

మూడో వన్డేతో ఫామ్ లోకి..
కానీ ఆ తర్వాత మూడో వన్డేతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ బాది తన ఫ్యాన్స్ ను అలరించాడు. దీంతో ఇప్పుడు అతడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చెలరేగుతాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే విరాట్ గురించి మాట్లాడిన యువరాజ్ సింగ్.. కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఫామ్ గురించి విమర్శలు చేయడం, ఆందోళన చెందడం కాకుండా, అతడి గ్రాఫ్ చూడాలని పేర్కొన్నాడు.