విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)8వ ఎడిషన్లో అత్యంత ఖరీదైన ఆటగాడు యువరాజ్ సింగ్. ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంజైజీ రూ. 16 కోట్లు వెచ్చించి యువరాజ్ను ఐపీఎల్ వేలంలో సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు యువరాజ్ సింగ్ ఆడిన మ్యాచ్ల్లో ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు.
ఈఏడాది ఐపీఎల్లో యువరాజ్ సింగ్ ఇప్పటి వరకు మొత్తం ఆరు మ్యాచ్లాడి 122 పరుగులు చేశాడు. ఒక్క పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అర్ధసెంచరీ మినహా చెప్పుకోదగ్గ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. ఐపీఎల్లో పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో యువీ స్ధానం 20.
ఈ ఏడాది ఐపీఎల్లో 'అత్యంత ఖరీదైన ఆటగాడు' ట్యాగ్ను సొంతం చేసుకున్న యువీపై ఒత్తిడి కూడా పెద్దగా లేనట్లు కనిపిస్తోంది. విశాఖపట్నంలో సన్ రైజర్స్ మ్యాచ్ అనంతరం ఎక్కువ ధర చెల్లించి మిమ్మల్ని కొనుగోలు చేయడం ద్వారా ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా? అన్న ప్రశ్నకు గాను యువీ అలాంటిదేమీ లేదని బదులిచ్చారు.

'ఐపీఎల్ వేలం పాట జరుగుతున్న సమయంలో నేను నిద్రిస్తున్నా. నాకు అంత డబ్బు ఇవ్వమని నేను ఎవరకీ చెప్పలేదు. ఏదైతే డబ్బు నాకిస్తున్నారో అది ఐపీఎల్లో ఆడినందుకేనని' యువీ చెప్పాడు. క్యాన్సర్ను విజయవంతంగా జయించిన తర్వాత టీమిండియా జట్టులో తిరిగి చోటు సంపాదించుకున్న ఈ ఆల్ రౌండర్, ఐపీఎల్లో ప్రేక్షకులను అలరించే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపించడం లేదు.
'నేను ఆడే క్రికెట్ను ఎంజాయ్ చేస్తున్నా. జట్టులో సభ్యుడిగా డేర్ డెవిలిస్ జట్టుని ట్రాక్లో పడేందుకు నా వంతుగా కృషి చేస్తా. 11 వరుస ఓటమిల తర్వాత ఈ గెలుపు ఆటగాళ్లలో విశ్వాసం నింపింది. చివరి మ్యాచ్లో నా ఇన్నింగ్స్ను సరిగ్గా ప్లాన్ చేసేందుకు ఎక్కువ సమయం లభించింది.' అని చెప్పాడు.
ఇక ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్లో యువీ రెండు పరుగులకే పెవిలియన్కు చేరిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 190 పరుగులు సాధించింది. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తడబడి త్వరగా వికెట్లను కోల్పోయింది.
దీంతో ముంబై ఇండియన్స్ మల్లీ ఓటమి బాట పట్టింది. ఇక ఢిల్లీ మాత్రం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఉన్న తన రికార్డుని నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు ఆ స్టేడియంలో జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ 10 విజయాలను నమోదు చేసింది. 56 బంతుల్లో 83 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.