హైదరాబాద్: దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్లో అభిమానులకు ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. 'నమస్తే. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరికీ నాదొక విన్నపం. దయచేసి టపాసులు కాల్చకండి. గతేడాది పండుగ సందర్భంగా ఏర్పడిన కాలుష్యం కారణంగా ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారు' అని పేర్కొన్నాడు.
'పండుగ రోజు కాలుష్యమైన గాలిని పీల్చాల్సి వస్తోంది. గతేడాది పండుగ సమయంలో నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోయా. ఇది మనతో పాటు మన పిల్లలకు, స్నేహితులకు, తల్లిదండ్రులకు, ఇష్టమైన వారందరికీ ఎంతమాత్రం మంచిది కాదు. దీపావళి అంటే వెలుగులు విరజిమ్మడం. టపాసులు కాల్చడం అపేసి దీపాలు వెలిగించి పండగ చేసుకుందాం' అని యువీ తెలిపాడు.

'ఇరుగుపొరుగు వారిని ప్రేమతో కౌగిలించుకుని ప్రేమను, సంతోషాన్ని పంచుదాం. మిఠాయిలు కూడా పంచుకుందాం. సంతోషంగా ఆడుకుందాం. చిన్నపిల్లలందరూ తప్పక మాస్క్లు ధరించండి. కాలుష్యం నుంచి మన దేశాన్ని కాపాడుకునేందుకు మనమే బాధ్యత తీసుకోవాలి. అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు' అని యువరాజ్ పేర్కొన్నాడు.