యువీ గురించి చెప్పాలంటే
యువీ గురించి చెప్పాలంటే క్రికెట్లో ఏ షాట్ ఆడినా ఆ షాట్కే అందం. తన బ్యాట్ నుంచి ఎన్నో కళాత్మక ఇన్నింగ్స్లు వచ్చాయి. ఒత్తిడిలో సైతం మొండిగా ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు ఎదురెళ్లి మరీ జట్టుకు విజయాలనందించాడు. అటు బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లో అద్భుతమైన విన్యాసాలు యువీ సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో యువీ తొలి ఇన్నింగ్సే ఒక సంచలనం. 2007 టీ20 వరల్డ్కప్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తే.
2011 వరల్డ్కప్లో
ఇక, 2011 వరల్డ్కప్లో టీమిండియా ఛాంపియన్గా నిలవడంలో యువీ పాత్ర ఎంతో కీలకం. భారత్ విజేతగా నిలిచిన 2007 టీ20 ప్రపంచకప్లో కూడా యువీ తన వంతు పాత్ర పోషించాడు. ఇలా యువరాజ్ సింగ్ కెరీర్లో ఎన్నో అద్భుత ఘట్టాలున్నాయి. సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాల తర్వాత ఆటగాడిగా ఒక స్థాయి, పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్న గొప్ప క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
యువరాజ్ గొప్ప ఆటగాడు
ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో యువరాజ్ సింగ్ గొప్ప ఆటగాడు. వన్డే క్రికెట్కు దూకుడుని కూడా నేర్పించాడు. భారత్ నుంచి వచ్చిన అత్యుత్తమ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్లో యువరాజ్ ఒకడు. క్రీజులో యువరాజ్ ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. అతడి బ్యాటింగ్లో ఉండే మజానే వేరు. వన్డేల్లో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా టెస్టుల్లో మాత్రం యువీ వైఫల్యమయ్యాడు.
యువరాజ్కు క్యాన్సర్ ఉందని తెలిసినా
ఇక, యువరాజ్ సింగ్కు 2011 వరల్డ్కప్ సమయంలోనే యువరాజ్కు క్యాన్సర్ (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి) ఉందని గుర్తించారు. తనకు క్యాన్సర్ ఉందని తెలిసినా ఆటకే ఎక్కువ ప్రాధాన్యతమిచ్చి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డుని సైతం అందుకున్నాడు. యువీ క్యాన్సర్ను జయించిన తీరు అతడిని ఓ పైటర్ను చేసింది. క్యాన్సర్ చికిత్స అనంతరం యువరాజ్ పూర్వంలా ఆడలేడని అంతా భావించారు.
వాళ్లు తప్పని నిరూపించాడు
అయితే, యువీ మాత్రం వాళ్లు తప్పని నిరూపించాడు. అంతేకాదు... క్యాన్సర్ నుంచి కోలుకుని 'ది టెస్ట్ ఆఫ్ మై లైప్' అనే పుస్తకం కూడా రాశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యువరాజ్ ఓ పోరాట యోధుడు. ప్రస్తుతం యువీకెన్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్తో బాధపడే చిన్నారులు, పేదలు ఎంతో మందికి సాయం చేస్తున్నాడు. అయితే, యువరాజ్ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఫేర్వెల్ మ్యాచ్ ఇస్తే బాగుండేది
అంతర్జాతీయ క్రికెట్కు యువరాజ్ ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఓ ఫేర్వెల్ మ్యాచ్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడ్డాడరు. యువరాజ్ సైతం రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా దీనిని గుర్తు చేసుకున్నాడు.
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ యో-యో టెస్టు పాసైతే ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ తనకు మాటిచ్చిందని కానీ దానిని నిర్వర్తించలేకపోయిందని చెప్పాడు.
యువరాజ్ సింగ్దే కీలకపాత్ర
28 ఏళ్ల తర్వాత భారత్ రెండోసారి వన్డే వరల్డ్కప్ అందుకోవడంలో యువరాజ్ సింగ్దే కీలకపాత్ర. అలాంటి యువరాజ్ సింగ్కు బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. 2011 వరల్డ్కప్ అనంతరం యువరాజ్ సింగ్ కెరీర్ డౌన్ఫాల్ అయింది. ప్రాణాంతక క్యాన్సర్కు అమెరికాలో చికిత్స తీసుకున్న అనంతరం పునరాగమనం చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
21 బంతుల్లో 11 పరుగులు
అంతేకాదు టీమిండియా యువరాజ్ సింగ్ వల్ల ఓ టీ20 వరల్డ్కప్ను కోల్పోయింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో యువీ 21 బంతులాడి 11 పరుగులే చేయడం భారత్ అవకాశాల్ని దెబ్బ తీసింది. ఈ మ్యాచ్లో యువీ 21 బంతుల్లో 11 పరుగులే చేయడం అతడి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా యువీ సైతం ఆ వైఫల్యాన్ని గుర్తు చేసుకున్నాడు.
హుందాగా యువీ వీడ్కోలు
ఏది అయితేనేం ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా యువరాజ్ సింగ్ హుందాగానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడనే చెప్పాలి. అయితే, యువరాజ్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ప్రస్తుతం ప్రపంచకప్ జరుగుతున్నందున ఎలాంటి వివాదాలకు చోటివ్వదలచుకోలేదని, కచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పాడు.