హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్లో ఆడటమే తన లక్ష్యమని టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. గతేడాది కాలంగా పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువరాజ్... ప్రస్తుతం దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు.
ఈ టోర్నీలోనూ ఇప్పటివరకు 7 మ్యాచ్లాడిన యువరాజ్ మొత్తం 264 పరుగులు చేశాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో యువరాజ్ మాట్లాడుతూ "భారత్ జట్టు తరఫున 2019 ప్రపంచకప్లో ఆడటమే నా లక్ష్యం. అందుకే అవకాశం దొరికిన మ్యాచ్ల్లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నా" అని అన్నాడు.
"బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిట్నెస్ ఇలా అన్ని అంశాల్లోనూ దృష్టి పెట్టాను. గతేడాది నేను ఆశించిన విధంగా దేశవాళీ క్రికెట్లో రాణించలేకపోయా. ఐపీఎల్ 2018 సీజన్లోనూ కూడా మెప్పించలేదు. ఇప్పుడు భారత్-ఎ జట్టు తరఫున ఆడి సెలక్టర్లని ఆకర్షించొచ్చు. అక్కడ ఆడి యువ క్రికెటర్ల అవకాశాల్ని దెబ్బతీయాలని అనుకోవట్లేదు" అని తెలిపాడు.
"ప్రస్తుతం.... ఇప్పుడు దేశవాళీ టీ20 టోర్నీమెంట్ ఆడేందుకు సిద్ధమవుతున్నా. చూడాలి ఇది నా కెరీర్ని గాడిన పడేస్తుందేమో?" యువరాజ్ సింగ్ అన్నాడు. మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం 2017లో టీమిండియాలోకి పునరాగమనం చేసిన యువీ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో 150 పరుగులతో సత్తాచాటాడు.
దీంతో మళ్లీ అతడి కెరీర్ గాడిన పడిందని అంతా భావించారు. కానీ, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు టీమిండియాలో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే మిడిలార్డర్లో మనీశ్ పాండే, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.