హైదరాబాద్: శ్రీలంకతో వన్డే సిరీస్కు సీనియర్ క్రికెటర్లు యువరాజ్సింగ్, రైనాను సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద చర్చ నడుస్తోంది. అయితే యువీ, రైనాలకు చోటు దక్కకపోడవడానికి కారణం తెలిసింది. జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో-యో సామర్థ్య పరీక్షలో విఫలమైన కారణంగానే వీరిద్దరిని పక్కకుపెట్టినట్లు బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.
సిరీస్లకు జట్టును ఎంపిక చేసే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా యో-యో పరీక్ష తప్పక పాస్ కావాల్సి ఉంటుంది. గతంలో ఉన్న బీప్ పద్ధతికి కాస్తంత అడ్వాన్స్గా వచ్చిన ఈ యో-యో సామర్థ్య పరీక్షలో కచ్చితమైన ఫలితం వస్తుంది. 19.5 అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన ఆటగాళ్లు ఫిట్నెస్తో ఉన్నట్లు లెక్క.
కెప్టెన్ కోహ్లీ, జడేజా, మనీష్ పాండేలకు ఈ పరీక్ష నిర్వహించగా మిగతా వాళ్ల కంటే మిన్నగా 21 కంటే ఎక్కువ పాయింట్లే సాధించారు. ఈ పరీక్షలో యువరాజ్, రైనాలు ఫెయిల్ అయ్యారు. యువీ కనీసం 16 పాయింట్లను కూడా అందుకోలేకపోవడంతో పాటు ఇతర కారణాలు కూడా అతడికి జట్టులో చోటు దక్కకపోడవడానికి కారణమయ్యాయి.
ఇక మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్ చేసే సురేశ్ రైనా కూడా ఈ పరీక్షలో ఫెయిల్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రైనా కూడా 16 పాయింట్ల వద్దే ఆగిపోయాడని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ, జడేజా, మనీశ్పాండే మాత్రం రెగ్యులర్గా 21 పాయింట్లను అందుకుంటారు.
ఏమిటీ యో- యో పరీక్ష?
డెన్మార్క్ ఫుట్బాల్ ఫిజియాలజిస్ట్ జెన్స్ బాంగ్స్బొ యో-యో పరీక్షను రూపొందించాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, సామర్థ్యం అంచనా వేయడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. 20 మీటర్ల ఎడంతో సమాంతరంగా వరుసగా కోన్స్ లేదా షటిల్స్ ఏర్పాటు చేస్తారు. రికార్డు చేసిన బీప్ శబ్దం ప్రకారం ఆటగాడు పరుగెత్తాలి.
ఒక్కో నిమిషానికి బీప్ శబ్దంలో వేగం పెరుగుతుంది. బీప్ శబ్ధం వినిపించేలోపు లైన్ను చేరుకోలేకపోతే మరో రెండు బీప్ శబ్దాలు వినిపించేలోపు వేగం పెంచి గమ్యానికి చేరుకోవాలి. లేకపోతే పరీక్షను ఆపేస్తారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు లెవెల్స్ ఉంటాయి.
లెవెల్-1లో గంటకు 8 నుంచి 18.5 కిమీ వేగం ఉంటుంది. ఇందుకు 6 నుంచి 20 నిమిషాలు సమయం పడుతుంది. లెవెల్-2లో గంటకు 11.5 కిమీ వేగంతో పరీక్ష ప్రారంభమవుతుంది. 2 నుంచి 10 నిమిషాల్లో ఈ పరీక్ష పూర్తి అవుతుంది. ఈ పరీక్షను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తారు.