హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే యువీకి 300వ వన్డే. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్తో అందుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
భారత తరపున కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేల మైలురాయిని అందుకున్నారు. వన్డేల్లో 300 మ్యాచ్లు ఆడిన మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ల సరసన చేరాడు. తన కెరీర్లో300వ వన్డే ఆడుతున్న యువరాజ్కు మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ చేత బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ అరుదైన రికార్డు అందుకోవడం పట్ల యువరాజ్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన తొలి వన్డేలో యువరాజ్ అర్ధసెంచరీని సాధించాడు.
2011 వరల్డ్ కప్ తర్వాత అరుదైన జెర్మ్సెల్ క్యాన్సర్ను జయించి తిరిగి మైదానంలోకి అడిగిన పెట్టిన యువరాజ్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన యువరాజ్ కెరీర్ ఆరంభంలో మెక్గ్రాత్, బ్రెట్లీ, గిలెస్పీ లాంటి ప్రమాదకర బౌలర్లను అవలీలగా ఎదుర్కొని తన సత్తా చాటాడు.
ఇంగ్లండ్తో నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో గెలుపుపై భారత్ ఆశలు వదులుకున్న వేళ యువరాజ్ తన అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీతో జట్టుకు మరో అపురూప విజయాన్ని అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ విజయాల్లో యవీ కీలకపాత్ర పోషించాడు.
తన కెరీర్లో 300వ వన్డే ఆడుతున్న యువరాజ్ సింగ్పై మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్లతో పాటు హర్భజన్ సింగ్, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్లు శుభాకాంక్షలు తెలిపారు.