
డబ్బును ఏంచేయాలో తెలియడం లేదు:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్లో సాగిన సంభాషణలో యువరాజ్ సింగ్ పలు విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. 'కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే చాలు ఐపీఎల్ కాంట్రాక్ట్ల ద్వారా పెద్ద మొత్తంలో కుర్రాళ్లకు డబ్బు లభిస్తోంది. చిన్న వయసులోనే ఏకాగ్రత చెదిరి వేరే అంశాలపై దృష్టి మరలుతోంది. వారు కెరీర్ ఆరంభంలోనే ఉన్నారు. ఇంకా భారత్ తరఫున కూడా ఆడలేదు. కానీ.. ఆర్జన మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంత డబ్బును ఏం చేసుకోవాలో వారికి తెలియడం లేదు. అందుకే తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు' అని యువీ అన్నాడు.

కోచ్ల మార్గనిర్దేశనం కావాలి:
'కుర్రాళ్లకు ఎప్పటికప్పుడు సీనియర్లు, కోచ్ల మార్గనిర్దేశనం కావాలి. మైదానంలో శ్రమించాలని, దేశానికి ఆడటమే ముఖ్యమని వారికి తెలియాలి. నువ్వు బాగా ఆడితే చాలు మిగతావన్నీ నీ వెంటే వస్తాయి అని సచిన్ టెండూల్కర్ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అలా ఎప్పుడూ వారికి మంచి మాటలు చెప్పాలి' అని యువరాజ్ చెప్పాడు. యువరాజ్ 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 19 ఏళ్ల కెరీర్ తర్వాత గత ఏడాది ఆటకు గుడ్బై చెప్పాడు.

ఐపీఎల్ ఉంటే చాలనుకుంటున్నారు:
'ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లినప్పుడు కొందరు యువ ఆటగాళ్లను పరిశీలించా. వారు టెస్టులు ఆడాలని ఏమాత్రం కోరుకోవడం లేదనే విషయం అర్థమైంది. తమ రాష్ట్రం తరఫున రంజీల్లో కూడా ఆడాలని భావించడం లేదు. కేవలం ఐపీఎల్ ఉంటే చాలనుకుంటున్నారు. యువ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలి. వివిధ పిచ్లపై ఆడి రాటుదేలితే భారత్ తరఫున కూడా బాగా ఆడగలరు' అని యువీ వివరించాడు.

కుర్రాళ్లను చూస్తే బాధేస్తోంది:
'నాటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. మూడు ఫార్మాట్లు ఆడే వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్ప సీనియర్లు ఎవరూ లేరు. ఈతరం కుర్రాళ్లను చూస్తే కొంత బాధేస్తోంది. మనకు అండగా నిలిచి సరైన దారిని చూపే వారు ఎవరన్నా ఉన్నారేమోనని చూస్తే జట్టులో అలాంటివారే కనిపించడం లేదు. ఫలితంగా సీనియర్లంటే గౌరవం కూడా తగ్గింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. మేం ఎవరినైనా ఏదైనా అన్నట్లుగా యువ ఆటగాళ్లు తయారయ్యారు' అని మాజీ ఆల్రౌండర్ ఆవేదన వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications












