గంగూలీకి నా ఓటు:
యువరాజ్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... 'గంగూలీ నాయకత్వంలో అరంగేట్రం చేసిన నాకు చాలా మద్దతు దక్కింది. నా కెరీర్లో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు దాదా హయంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ధోనీ, కోహ్లీ నాయకత్వంలో నాకు ఆశించినంతా మద్దతు లభించలేదు. మహీ, దాదా ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు? అనేది చెప్పాలంటే కష్టమే. కానీ.. గంగూలీతోనే నాకు ఎక్కువగా జ్ఞాపకాలు ఉన్నాయి' అని యువీ అన్నాడు. ధోనీ, కోహ్లీ నుంచి ఎక్కువ సపోర్ట్ ఎప్పుడూ లభించలేదన్నాడు. గంగూలీనే తన హీరో అని చెప్పకనే చెప్పాడు.
యోగరాజ్ ఆరోపణలు:
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ని టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. కానీ. పేరు మాత్రం అప్పటి కెప్టెన్ఎంఎస్ ధోనీకి వెళ్ళిందని చాలా మంది బాహాటంగానే పెదవి విరిచారు. కానీ.. యువీ, ధోనీ మాత్రం ఎప్పుడూ బాహాటంగా ఈ విషయంపై చర్చించలేదు. అయితే.. తొలిసారి ధోనీ నుంచి తనకి ఆశించిన మేర సహకారం లభించలేదని యువీ అన్నాడు. యువీ కెరీర్ గాడి తప్పడానికి కారణం ధోనీ అని అతని తండ్రి యోగరాజ్ సింగ్ ఎన్నోసార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
గుండెలు బరువెక్కెలా చేస్తోంది:
మరోవైపు కరోనా వైరస్పై కూడా యువరాజ్ సింగ్ స్పందించాడు. 'మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చనిపోవడం గుండెలు బరువెక్కెలా చేస్తున్నది. వైరస్ గురించి భయపడటం కంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్సైట్ చూస్తే ప్రజలకు అన్ని అర్థమవుతాయి. అందరూ ఇంట్లోనే ఉండి ఆరోగ్యం కాపాడుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం' అని యువీ సూచించాడు.
304 వన్డేలు.. 8701 పరుగులు:
యువరాజ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.