హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రపంచకప్ ఫీవర్ నడుస్తోంది. అటుఇటుగా ఈ ప్రభావం క్రికెట్ మీద కూడా పడింది. ఫుట్బాల్పై సిక్సర్లు వీరుడు యువరాజ్ సింగ్ స్పందించాడు. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ సెషన్స్లో ఎక్కువగా ఫుట్బాల్ ఆడుతూ ఉంటారని గుర్తు చేశాడు. అంతేకాదు ఏటా బాలీవుడ్ తారలతో కలిసి టీమిండియా క్రికెటర్లు ఓ ఛారిటీ మ్యాచ్ కూడా ఆడతారట.
ఇంతకీ టీమిండియా ఎవరు ఫుట్బాల్ బాగా ఆడతారు.. ఎవరికి ఆడటం సరిగ్గా రాదు అన్నది మనకు సరిగా తెలియదు. ఇదే ప్రశ్నల్ని సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ను అడిగితే ఏం చెప్పాడంటే.. ఇటీవల యువీ ఓ వెబ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియాలో ఏ ఆటగాడు ఫుట్బాల్ బాగా ఆడతాడు, ఎవరు సరిగ్గా ఆడరు అని అడిగారు.
దీనికి యువీ 'జట్టు మొత్తంలో విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడతాడు. ఫుట్బాల్ క్రీడ గురించి అతనికి తెలిసినంత జట్టులోని మిగతా ఏ క్రికెటర్కు తెలియదనే అనుకుంటున్నాను. కానీ, పాపం కోహ్లీ ఎప్పుడూ గోల్ కొట్టడంలో విజయం సాధించలేదు. ధోనీ కూడా బాగా ఆడతాడు. ఇక జట్టులో ఫుట్బాల్ చెత్తగా ఆడేది ఎవరంటే రోహిత్ శర్మ. బంతిని పాస్ చేస్తాడు అంతే. అతను ఎక్కడ నిల్చున్నాడో అక్కడ నుంచి కదలను కూడా కదలడు. ఏమీ చేయడు' అని యువీ నవ్వుతూ బదులిచ్చాడు.
'జస్ప్రిత్ బుమ్రా ఫుట్బాల్ ఆడడు. హార్ధిక్ పాండ్యా చాలా చెత్తగా ఆడతాడు. వారిద్దరూ ఫుట్బాల్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి' అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇంకా మాట్లాడుతూ.. అతనికి పాల్ పోగ్బా అంటే అభిమానం అని అభిమాన జట్టు మాంచెస్టర్ యునైటెడ్ అని పేర్కొన్నాడు.