
ముంబై: టీమిండియా మాజీ ఆల్రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడు ఆడే కాలంలో స్టైలిష్ క్రికెటర్లలో ఒకరిగా పేరు పొందాడు. మైదానం బయట ఎప్పుడూ కొత్తగా ఉంటాడు. తాజాగా యువరాజ్ సరికొత్త లుక్తో మరోసారి అభిమానులను అలరించాడు. యువీ తన న్యూలుక్కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యువీ పొడవాటి జుట్టుతో పాటు గడ్డంతో ఉన్నాడు. అంతేకాదు కళ్లకు అద్దాలు పెట్టి ఓ పోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
యువరాజ్ సింగ్ పోస్టుకు అభిమానులు భారీ ఎత్తున లైక్లు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువీ తాజా పోస్టుపై టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్ తదితరులు కామెంట్లు చేశారు. 'యువీ.. భాయ్ బాద్ షాలా మారిపోయావ్' అంటూ గబ్బర్ పోస్ట్ చేయగా.. 'ఏమైంది యువీ భయ్యా' అని జడేజా ట్వీట్ చేశాడు. 'సరికొత్త లుక్ బాగుంది' అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
2019, జులై 10 యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ సహా మరే టోర్నీలేవీ ఆడనని వెల్లడించాడు. యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
తాజాగా ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ 2021 లో యువరాజ్.. తన పూర్వపు ఫామ్ను కనబరుస్తూ ఇండియా లెజెండ్స్ను చాంపియన్గా నిలబెట్టాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో 170.17 స్ట్రయిక్ రేట్తో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్లో యువీ మొత్తం 17 సిక్సర్లు బాదాడు. టోర్నీ మొత్తంలో యువీనే అత్యధిక సిక్సర్లు ఆటగాడిగా నిలవడం విశేషం. వెస్టిండీస్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో ఆయన వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. శ్రీలంక లెజెండ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు.