హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 32 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన యువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | స్కోరు కార్డు
దీంతో ఈ టోర్నీలో యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్లలో యువరాజ్ రెండో ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్కు ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సచిన్ తన కెరీర్లో ఐసీసీ టోర్నమెంట్ల ద్వారా 10 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. పాక్తో జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద్వారా యువరాజ్ ఐసీసీ టోర్నీల్లో ఇప్పటి వరకు 9 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుని రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
అంతేకాదు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్తో భారత్ తరఫున యువరాజ్ ఇప్పటి వరకు 14 ఐసీసీ టోర్నమెంట్స్లో పాల్గొన్నాడు. 2000 సంవత్సరంలో మొదటిసారి ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టిన యువీకి తాజా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 14వది. యువీకి ముందు సచిన్ పేరిట ఈ రికార్డు ఉంది. తాజా టోర్నమెంట్తో యువీ.. సచిన్తో సమానంగా నిలిచాడు.
ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ యువీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్గేల్ (11) అగ్రస్ధానంలో ఉన్నాడు.
ఆ తర్వాతి స్థానాల్లో సచిన్, యువరాజ్ ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్ మ్యాచ్లో పాత యువీని అభిమానులు చూడటంతో సంబురాలు చేసుకుంటున్నారు. యువీ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాతో యువరాజ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. యువీ ఆటతీరుపై ఒకప్పటి ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్మన్ ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.