క్రికెట్కు గుడ్బై: యువరాజ్ క్యాన్సర్ను ఎలా జయించాడో తెలుసా?

హైదరాబాద్: యువరాజ్ సింగ్ లేని భారత క్రికెట్ను ఊహించడం చాలా కష్టం. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలందించడంతో పాటు క్రికెట్లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్గా, ఆల్రౌండర్గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ముఖ్యంగా టీమిండియాకు రెండు ప్రపంచకప్లు(వరల్డ్ టీ20 2007, వన్డే వరల్డ్ కప్ 2011) అందించడంలో కీలకపాత్ర పోషించాడు. అలాంటి యువరాజ్ జూన్ 10(సోమవారం) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు.

యువరాజ్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పాడు. "క్రికెట్ కోసం తన రక్తం, స్వేదం ధారపోశాను. క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం. జీవితంలో ఏ విధంగా పోరాడాలో క్రికెటే నేర్పింది" అని యువరాజ్ అన్నాడు.

ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు
"జీవితంలో నేను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. క్రికెట్ ఆడటం.. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం నేర్పింది" అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు. ఇకపై క్యాన్సర్ బాధితులకు అండగా ఉండటమే తన తదుపరి లక్ష్యమని యువరాజ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పాడు.

వరల్డ్కప్ సమయంలో యువీకి క్యాన్సర్
కాగా, 2011 వరల్డ్కప్ సమయంలోనే యువరాజ్కు క్యాన్సర్ (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి) ఉందని గుర్తించారు. టోర్నీ మధ్యలో తనకు క్యాన్సర్ ఉందని తెలిసినా ఆటకే ఎక్కువ ప్రాధాన్యతమిచ్చి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డుని సైతం అందుకున్నాడు. శస్త్రచికిత్స అవసరం లేదనడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మూడు దశలుగా కీమోథెరపీ
అయితే, వరల్డ్కప్ అనంతరం యువరాజ్ సింగ్ అమెరికాకు వెళ్లడంతో మూడు దశలుగా కీమోథెరపీ చికిత్స అందించారు. దీంతో క్యాన్సర్ నుంచి కోలుకుని 'ది టెస్ట్ ఆఫ్ మై లైప్' అనే పుస్తకం కూడా రాశాడు. అయితే, ఆటలో మాత్రం వెనుకబడిపోయాడు. అనంతరం యువీకెన్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్తో బాధపడే చిన్నారులు, పేదలు ఎంతో మందికి సాయం చేస్తున్నాడు.

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు
యువీ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన సంఘటన. 2007 వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ యువరాజ్ సింగ్ 6 సిక్సులు బాదాడు. దీంతో ఈ మ్యాచ్లో టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

2017లో ఆఖరి వన్డే
భారత్ తరుపున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడిన యువరాజ్ 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 304 మ్యాచ్లాడి 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్లాడిన యువీ 8 ఆఫ్ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్ 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications