
చెత్త షాట్స్ అని అవహేళనగా మాట్లాడాడు:
ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ... 2007 టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 'అసలు ఆరోజు ఏం జరిగిందంటే.. ఫ్లింటాఫ్ వరుసగా రెండు మంచి బంతులు వేశాడు. అందులో ఒకటి యార్కర్. ఆ రెండు బంతుల్ని నేను ఫోర్లుగా మలిచా. దాంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్.. మరో ఎండ్కు నడుచుకుంటు వెళ్తున్న నాపై నోరుపారేసుకున్నాడు. అవి చెత్త షాట్స్ అని అవహేళనగా మాట్లాడాడు. చాలా గంభీరంగా ఆ మాట అన్నాడు' అని యువీ తెలిపాడు.

గొంతు కోస్తా అని హెచ్చరించాడు:
'ఫ్లింటాఫ్ అలా అన్నా కూడా నేను ఏమీ అనలేదు. ఆపై నీ గొంతు కోస్తా అని హెచ్చరించాడు. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. నా చేతిలో బ్యాట్ చూశావా, ఈ బ్యాట్తో నిన్ను ఎక్కడ కొడతానో తెలియదన్నా. నాకు ఆ సమయంలో చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఓవర్లోనే నేను స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టా. ఆరు సిక్సర్ల తర్వాత దిమిత్ మస్కరెనాస్ వైపు చూసి, ఆ తర్వాత ఫ్లింటాఫ్ వైపు చూశా. అప్పుడు నా కోపం చల్లారింది' అని యువీ పేర్కొన్నాడు.

మస్కరెనాస్ నా బౌలింగ్లో ఐదు సిక్సర్లు కొట్టాడు:
అయితే ముందు మస్కరెనాస్ వైపు చూడటానికి కారణం కూడా యూవీ వెల్లడించాడు. 'అంతకుముందు జరిగిన ఓ వన్డే మ్యాచ్లో మస్కరెనాస్ నా బౌలింగ్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. అందుకే అతన్ని ముందు చూశా. ఆ తర్వాత ఫ్లింటాఫ్ వైపు చూశా. అది ఇప్పటికీ బాగా గుర్తుంది. నిజాయతీగా చెప్పాలంటే.. నా మైండ్లో ఆరు సిక్సర్లు కొట్టాలనే ఆలోచన లేదు కానీ.. ఫ్లింటాఫ్తో గొడవ నన్ను హిట్టింగ్కు పురిగొల్పింది' అని యువీ చెప్పాడు. యూవీ బౌలింగ్లో మస్కెరెనాస్ (0,6,6,6,6,6) వరుస బంతుల్లో ఐదు సిక్స్లు బాదాడు.

7 సిక్స్లు, 3 ఫోర్లతో 58 పరుగులు:
టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఫ్లింటాఫ్తో గొడవ 18 ఓవర్లో జరగ్గా.. బ్రాడ్ బౌలింగ్లో ఆరు సిక్సర్లను 19 ఓవర్లో సాధించాడు యువీ. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. యువరాజ్ 7 సిక్స్లు, 3 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్లో భాగంగా ఇంకా ఒక బంతి మాత్రమే ఉందనగా ఫ్లింటాఫ్ బౌలింగ్లో యువీ ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్ లక్ష్యాన్ని అందుకోలేక 18 పరుగులతో ఓడింది. ఇక ఆ అరంగేట్ర టీ20 ప్రపంచకప్ను మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాయదీ పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో భారత్ అద్బుత విజయాన్నందుకుంది.

నా కొడుకు కెరీర్ను ముగించేసావు:
యూవీ విధ్వంసంతో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అపఖ్యాతిని బ్రాడ్ మూటగట్టుకున్నాడు. దీంతో అతని కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. ఆఖరికి అతని తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా యువరాజ్ దగ్గరకు వచ్చి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడంట! అవును ఈ విషయాన్ని తాజాగా యూవీనే చెప్పాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అయిన క్రిస్ బ్రాడ్.. ఆ దేశం తరఫున 25 టెస్ట్లు, 35 వన్డేలు ఆడాడు. 'స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్.. మ్యాచ్ రిఫరీ. ఈ సిక్సర్ల విధ్వంసం మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి.. దాదాపు నా కొడుకు కెరీర్ను ముగించేసావు. కనీసం అతని కోసం ఓ షర్ట్పై సంతకమన్నా చేసివ్వు' అన్నాడని యువీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












