న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలీవుడ్ నటి హజాల్ కీచ్ను వివాహం చేసుకోనున్నారు. ఆయన తన పెళ్లి పత్రికను ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చేందుకు గురువారం నాడు పార్లమెంటుకు వచ్చారు. నవంబర్ 29-30న ఆయన పెళ్లి జరగనుంది.
యువరాజ్ సింగ్ ప్రధాని మోడీతో పాటు పలువురు మంత్రులు, ఇతర నాయకులను తన పెళ్లికి ఆహ్వానించనున్నారు. యువరాజ్ సింగ్ - హాజల్ల నిశ్చితార్థం ఇండోనేషియాలోని బాలిలో జరిగింది.
మరికొద్ది రోజుల్లో జరగనున్న యువీ పెళ్లికి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు, ఇతర ముఖ్యులు హాజరు కానున్నారు.
యువరాజ్ పైన నోట్ల రద్దు ఎఫెక్ట్!
నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లిళ్లకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్రం రూ.2.5 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చునని చెప్పింది. పెళ్లి ఖర్చుల కోసం వాటిని వినియోగించాలి. ఇందుకు పత్రాలు సమర్పించాలి.
ఇప్పుడు యువరాజ్ పెళ్లికి కూడా డబ్బులు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అతను కూడా తన పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.2.50 లక్షలను బ్యాంకు నుంచి తీసుకోవచ్చు.