
ఆసీస్తో వార్మప్ మ్యాచ్ కోసం బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు
ఆస్ట్రేలియాతో జరగనున్న వార్మప్ మ్యాచ్ కోసం బోర్డు ప్రెసిడెంట్ జట్టును సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. నిజానికి ఈ జట్టులో యువీ ఫామ్ని పరీక్షించేందుకు ఓ అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అసలు యువీని పట్టించుకోలేదు. ఈ వార్మప్ మ్యాచ్ కోసం దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టుని పరిగణనలోకి తీసుకున్నారు.

దులీప్ ట్రోఫీకి ఎంపికైన ఆటగాళ్లను పరిగణనలోకి
ఈ ట్రోఫీకి ఎంపికైన 45 మంది టాప్ ఆటగాళ్లలో పరిగణలోకి తీసుకుని బోర్డు ప్రెసిడెంట్ జట్టును ఎంపిక చేశారు. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో రాణించిన మరికొంత మంది ఆటగాళ్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు కోసం మొత్తం 14 మందితో కూడిన జట్టుని సెలక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు.

సెప్టెంబర్ 12న చెన్నైలో ఆసీస్తో వార్మప్ మ్యాచ్
వీరంతా సెప్టెంబర్ 12న చెన్నైలో జరిగే వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఆడనున్నారు. జట్టు ఎంపికను చూస్తుంటే భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఎంపిక జరిగిందనే సంకేతాల్ని మన సెలక్టర్లు పంపించారు. బీసీసీఐ ఎంపిక చేసిన మొత్తం 74 మంది ఆటగాళ్ల జాబితాలో యువీ లేకపోవడం విశేషం.

మరికొద్ది రోజుల్లో 37వ ఒడిలోకి
దీనిని బట్టి మరికొద్ది రోజుల్లో 37వ ఒడిలోకి అడుగుపెడుతున్న యువరాజ్ ఇక భారత జట్టు జెర్సీ ధరించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే క్రీడాకారులు యో-యో టెస్టులో తప్పక పాస్ కావాల్సిందే. ఈ టెస్టులో యువీ విఫలం కావడం కూడా అతడికి ఇబ్బందిగా మారింది.


Click it and Unblock the Notifications