
యాక్సిడెంట్లో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ హుషారుగానే ఉన్నాడట. తన క్రికెట్ కెరీర్లో విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలోనే పంత్కు యాక్సిడెంట్ అయింది. ఇలా ఎవరికైనా జరిగితే వాళ్లు చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అయితే పంత్ మాత్రం ఎప్పట్లాగే ఫన్నీగా నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నాడట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ లెజెండ్ యువరాజ్ సింగ్ చెప్పాడు.
ప్రస్తుతం రిహాబిలేషన్లో ఉన్న పంత్ను కలిసేందుకు యువీ (Yuvraj Singh) వెళ్లాడు. అక్కడ అతనితో సరదాగా సమయం గడిపాడు. పంత్తో కలిసి ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడీ మాజీ లెజెండ్. 'మళ్లీ తప్పటడగులకు.. ఈ ఛాంపియన్ త్వరలోనే మళ్లీ లేస్తాడు. కలిసి నవ్వుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడూ కూడా ఫన్నీగానే ఉన్నాడు. చాలా గొప్ప పాజిటివ్ వ్యక్తి. దీని వల్ల నీ బలం ఇంకా పెరుగుతుంది' అని పోస్టు చేశాడు.
గతేడాది న్యూ ఇయర్ సమయంలో ఇంటికి వెళ్తుండగా పంత్కు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అతను ఆటకు దూరమయ్యాడు. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్లో (IPL 2023) కూడా అతను ఆడటం లేదు. దీంతో అతని స్థానంలో ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ను (David Warner) టీం కెప్టెన్గా నియమించినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. అతని డిప్యూటీగా అక్షర్ పటేల్కు ప్రమోషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన వార్నర్.. పంత్ను తమ జట్టు బాగా మిస్ అవుతుందని చెప్పాడు.
'ఢిల్లీ క్యాపిటల్స్కు (Delhi Capitals) పంత్ టెర్రిఫిక్ లీడర్గా సేవలందించాడు. అతను ఇక్కడ లేకపోవడంతో మేం బాగా మిస్ అవుతాం. అలాగే అతని స్థానంలో నాకు కెప్టెన్సీ ఇచ్చిన టీం మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు. నాకు ఈ ఫ్రాంచైజీ ఎప్పుడూ ఇల్లులాగే అనిపించింది. ఇంత అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లకు నాయకత్వం వహించేందుకు చాలా ఎగ్జయిటింగ్గా ఎదురు చూస్తున్నా. వాళ్లందర్నీ కలిసేందుకు వెయిట్ చేస్తున్నా' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.