హైదరాబాద్: మనిషి పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని ఓ నానుడి ఉంది. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పోలిన వ్యక్తి పాకిస్థాన్లోని పిజ్జా హట్లో పని చేస్తోన్న సంఘటనను మనం చూశాం. తాజాగా టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ని పోలిన మరో వ్యక్తి కనిపించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
గురువారం టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగే సమయంలో యవరాజ్ సింగ్ను కలవడానికి ఓ అనుకోని అథితి వచ్చాడట. అతడు అచ్చం యూవీ లాగానే ఉండటంతో స్టేడియంకు వచ్చిన వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. మ్యాచ్ అనంతరం నిజమైన యువరాజ్తో ఓ సెల్ఫీ దిగి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఇద్దరు యూవీలు కలిసి దిగిన ఫోటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అంతేనా క్యాప్సన్ కూడా డిఫరెంట్గా పెట్టింది. అంతే ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవడమే కాదు.. ఆ ఫోటోలో నిజమైన యురాజ్ ఎవరంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన వన్డే యువీకి 300వ వన్డే. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్తో అందుకున్నాడు.
భారత తరపున కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేల మైలురాయిని అందుకున్నారు. వన్డేల్లో 300 మ్యాచ్లు ఆడిన మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ల సరసన చేరాడు. తన కెరీర్లో300వ వన్డే ఆడుతున్న యువరాజ్కు మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ చేత బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్ ఇప్పించింది.