టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ను ప్రధాన కోచ్గా దక్కించుకోవాలని కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా పోటీపడుతున్నాయి. యువీతో అందరికంటే ముందు గుజరాత్ టైటాన్స్ సంప్రదింపులు చేసింది. ఆశిష్ నెహ్రా స్థానంలో యువరాజ్ కోచ్గా బాధ్యతలు అందుకోవడం దాదాపు ఖాయమని ప్రచారం జోరుగా సాగింది.
కానీ తాజాగా యువరాజ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలోకి వచ్చింది. యువీకి భారీ ఆఫర్ ప్రకటించి చర్చలు మొదలుపెట్టింది. దీంతో గుజరాత్కు బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్తో యువరాజ్ తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నాడని సమాచారం. మరికొన్ని నెలల్లో మెగా వేలం ఉండటంతో, కప్ కలను నెరవేర్చుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ మార్పులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ను ప్రధాన కోచ్ స్థానం నుంచి తప్పించింది. కోచ్గా అదనపు బాధ్యతలు అందుకుంటానని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీ కోరినప్పటికీ.. ఫ్రాంచైజీ ఆసక్తి చూపించట్లేదు. ఆధునిక క్రికెట్తో యువకులపై ఎక్కువగా అవగాహన ఉన్న కోచ్లను వెతికే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కోచ్గా అనుభవం లేనప్పటికీ యువీ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ఆఫర్ ఉంచిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా తమ ప్రధాన కోచ్లను మార్చాలని భావిస్తున్నాయి. రాజస్థాన్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు అందుకోనున్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో రాజస్థాన్ ఫ్రాంచైజీతో ద్రవిడ్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకీ స్థానాల్లో కొత్తవాళ్లను తీసుకోవాలని గుజరాత్ ఫ్రాంచైజీ భావిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.