న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. రంజీల్లో పంజాబ్ జట్టుకు కెప్టెన్గా ఉన్న యువరాజ్ సింగ్ చెలరేగి పోయి ఆడుతున్నాడు. గ్రూప్ ఏ మ్యాచ్లో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ డబుల్ సెంచరీ సాధించాడు.
370 బంతులను ఎదుర్కొన్న యువరాజ్ 26 ఫోర్లు, 4 సిక్సులతో 260 పరుగులు సాధించి ప్రత్యర్ధి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం మూడో రోజు ఆటలో యువరాజ్ సింగ్ 179 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
ఆదివారం కూడా యువరాజ్ సింగ్ అదే స్ధాయిలో చెలరేగి పోయి ఆడాడు. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ సహచరులతో కలిసి కీలక భాగస్వామ్యాలను నమోదు చేశాడు. మూడో వికెట్కు వోహ్రాతో కలిసి యువరాజ్ సింగ్ 300కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
ఈ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు వోహ్రా(224) డబుల్ సాధించాడు. కాగా, 452/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ జట్టు యువీ డబుల్ సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్లో 670 పరుగులు చేసి బరోడాకు భారీ టార్గెట్ను నిర్దేశించింది.
ఇక, రెండో ఇన్నింగ్స్కు దిగిన బరోడా చివరి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా బరోడా తన తొలి ఇన్నింగ్స్లో 529 పరుగులు చేసి ఆలౌటైంది. బరోడా తొలి ఇన్నింగ్స్లో దీపక్ హుడా(293) డబుల్ సెంచరీ సాధించాడు.