ముంబై: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. తన ప్రియురాలు హజెల్ కీచ్లు ఎప్పుడు వివాహం చేసుకుంటారా? అని అభిమానులతో పాటు క్రికెటర్లూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై యువరాజ్ ముంబైలో నిర్వహించిన ఫ్యాషన్ కార్యక్రమంలో స్పష్టతనిచ్చాడు.
డిసెంబర్ మొదటివారంలో తాను హేజిల్ని వివాహం చేసుకుంటున్నానని చెప్పేశాడు. అనంతరం కాబోయే భార్య హజెల్తో కలిసి ర్యాంప్ వాక్ చేశాడు. యువరాజ్తో పాటు క్రికెటర్లు క్రిస్గేల్, రోహిత్ శర్మలూ ర్యాంప్ వాక్ చేశారు.

ఈ సందర్భంగా 'డబ్ల్యూసీ ఫ్యాషన్' యువరాజ్ నూతన వస్త్రాలను ఆవిష్కరించాడు. శనివారం జరిగిన ఈ ఫ్యాషన్ కార్యక్రమానికి పలువురు క్రికెటర్లతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. యూవీకెన్ అనే స్వచ్ఛంద సంస్థను యువరాజ్ సింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది.
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, అర్జున్ రాంపాల్, పర్హాన్ అక్తర్, పరాహ్ ఖాన్, తదితరులు తళుక్కుమనగా, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, డ్వేన్ బ్రావో, ఇశాంత్ శర్మ, మహ్మద్ కైఫ్, ఒలింపియన్ సుశీల్ కుమార్, హాకీ స్టార్ పీఆర్ శ్రీజేష్ లు పాల్గొని సందడి చేశారు.