సిడ్నీ: టీమిండియా కష్ట సమయాల్లో మ్యాచ్ విన్నర్ పాత్ర పోషించే స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సేవలను ట్వంటీ20 వరల్డ్ కప్లో వినియోగించుకోవాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేయడంలో యువరాజ్ పాత్ర అభినందనీయమని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచులో ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 17 పరుగులు అవసరమైన సమయంలో యువరాజ్ తొలి రెండు బంతులను ఫోర్, సిక్సర్గా మలచిన తీరు నిజంగా అద్భుతమన్నాడు.

ఈ రెండు షాట్లను కొట్టి సురేష్ రైనాపై ఒత్తిడి తగ్గించడంతోనే టీమిండియా విజయం సాధ్యమైందన్నాడు. యువరాజ్లో ఇంకా అమోఘమైన శక్తి ఉందనడానికి అతను మూడు విభాగాల్లోనూ(బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్) ఆకట్టుకోవడమే నిదర్శనమన్నాడు. బౌలింగ్ విభాగంలోనూ ఉత్తమంగా రాణించాడని తెలిపాడు.
యువరాజ్ ఆట తీరుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సహనం పాటిస్తేనే మంచిదని గవాస్కర్ సలహా ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్ భారత జట్టులో యువరాజ్ సింగ్ తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. రైనా కూడా టీ20 ఫార్మట్లో అత్యుత్తమ ఆటగాడేనని చెప్పాడు.