
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు యువరాజ్ సింగ్. ఒంటి చేత్తో టీమిండియాకు ఎన్నో ఘన విజయాలను అందించిన క్రికెటర్. అలాంటి క్రికెటర్ క్యాన్సర్ని సైతం జయించాడు. అయితే ఇటీవల కాలంలో జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడంలో విఫలమవతున్నాడు.
అంతేకాదు జట్టులో చోటు దక్కినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా వీటన్నింటిపై యునిసెఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో యువరాజ్ స్పందించాడు. తన ఓటమి ఒప్పుకుంటున్నా అని ఆ ఓటముల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని యువీ తెలిపాడు.
గత కొంతకాలంగా ఫిట్నెస్ పరీక్షల్లో విఫలమవుతున్నానని, కానీ తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యానని 36 ఏళ్ల యువరాజ్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం 2019 ప్రపంచకప్ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు యువీ తెలిపాడు.
'నేను ఫెయిన్ అయ్యానని చెబుతున్నా. ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నా. గత మూడు సార్లుగా ఫిట్ నెస్ టెస్టులో ఫెయిలయ్యా. కానీ నిన్నటి టెస్టులో పాస్ అయ్యా. 17 ఏళ్ల తర్వాత ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నా' అని యువీ తెలిపాడు.
'నేను ఓటమిని చూసి భయపడను. నేను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. నిజానికి ఓటమి గెలుపుకు పునాది వంటిది. జీవితంలో ఓ విజయవంతమైన పురుషుడిగా, విజయవంతమైన మనిషిగా ఎదగాలంటే ముందు ఓడిపోయాలి.. అప్పుడే మీరు మరింత బలవంతంగా రూపాంతరం చెందుతారు' అని యువీ అన్నాడు.
'ఇప్పటికీ నేను ఏదో ఫార్మాట్లో క్రికెట్ ఆడుతునే ఉన్నా.. గతంలో కంటే ఇంకా ఎక్కువగా కష్టపడుతూ 2019 ప్రపంచకప్ కోసం నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నా. వేరే వాళ్లు నన్ను నమ్మినా.. నమ్మకపోయినా.. నన్ను నేను నమ్ముతా.. నాకు అదే చాలు' అని యువీ అన్నాడు.
భారత్ తరుపున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడిన యువరాజ్ వరుసగా 1,900.. 8,701.. 1,177 పరుగులు చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.