హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన పాకిస్థాన్కు చెందిన వెటరన్ క్రికెటర్లు మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్లపై టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీరిద్దరూ చేసిన సేవలను కొనియాడాడు.
వెస్టిండిస్తో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ముగిసిన అనంతరం మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్లు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మిస్బా, యూనిస్ ఖాన్లను స్ఫూర్తిగా యువరాజ్ అభివర్ణించాడు.

'పాకిస్తాన్ క్రికెట్కు చెందిన ఇద్దరు గొప్ప బ్యాట్స్మన్లు ఆటకు వీడ్కోలు పలికారు. కెప్టెన్ మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్లు అంతర్జాతీయ క్రికెట్కు అందించిన సేవలు మా అందరికీ ఎంతో ప్రేరణ ఇచ్చాయి' అని యువరాజ్ సింగ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
తన రిటైర్మెంట్ను మళ్లీ సమీక్షించుకునే అవసరంగానీ, తిరిగి బరిలోకి దిగాలన్న ఆశగానీ లేదని మిస్బా స్పష్టం చేశాడు. పాకిస్థాన్ తరుపున మిస్బా 75 టెస్టులు ఆడి 5,222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
118 టెస్టులు ఆడిన ఇక యూనిస్ ఖాన్ టెస్టుల్లో 10,099 పరుగులు సాధించిన తొలి పాకిస్థాన్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన యూనిస్ ఖాన్ 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించాడు.