ముంబై: మొన్నటికి మొన్నే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్ సహా దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ను ఇక ఆడబోవట్లేదని స్పష్టం చేశాడు. అంతలోనే- ఆయనకు క్రికెట్పై మనసు మళ్లినట్టుంది. అందుకే- ఇతర దేశాల్లో నిర్వహించే టీ20 లీగ్ మ్యాచుల్లో ఆడటానికి అనుమతి ఇవ్వాలని యువరాజ్ సింగ్ తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు లేఖ రాశారు. వీలైనంత త్వరగా తనకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీ20, టీ10 క్రికెట్ ఫార్మట్లలో ఇతర దేశాలు నిర్వహించే లీగ్ మ్యాచుల్లో తనకు అవకాశాలు వస్తున్నాయని కోరారు. యువరాజ్ సింగ్ లేఖ రాసిన విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. అభ్యంతరం చెప్పడానికి ఎలాంటి కారణాలూ లేవని ఆ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల్లో నిర్వహించే లీగ్ మ్యాచ్లల్లో ఆడటానికి యువరాజ్ సింగ్కు అనుమతి ఇవ్వడం లాంఛానప్రాయమేనని చెప్పారు. త్వరలోనే ఈ లేఖపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని, అది సానుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.
నిజానికి- అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించే ఆటగాళ్లు పొరుగు దేశాల్లో నిర్వహించే టీ20 టోర్నమెంట్లలో పాల్గొనకూడదంటూ ఇదివరకు బీసీసీఐ ఓ నిబంధనను విధించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఆయా ఆటగాళ్ల ప్రతిభ స్వదేశానికి కొరగాకుండా పొతుందనేది బీసీసీఐ అభిప్రాయం. దీనితోపాటు గాయాలపాలు కాకుండా ఉండటానికి కూడా ఈ నిబంధన ఉపకరిస్తోందని చెబుతుంటారు. క్రికెట్ నుంచి యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో- ఆయనకు అనుమతి ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.
గతంలో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత పొరుగు దేశాల్లో నిర్వహించే టోర్నీల్లో ఆడిన విషయం తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించిన టీ10 లీగ్ మ్యాచుల్లో వారు ఆడారు. మరో మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కూడా లీగ్ మ్యాచుల్లో ఆడబోతున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో ఆడబోతున్న తొలి భారతీయ క్రికెట్ ఇర్ఫాన్ పఠాన్. కిందటి నెలలోనే ఆయన దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాడు.