బెంగళూరు: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ తన ప్రపంచ రికార్డును సమం చేయడం పట్ల భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 10 బంత్తుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి తన రికార్డును క్రిస్ గేల్ బ్రేక్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
సోమవారం ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ టోర్నీలో క్రిస్ గేల్ 12 బంతుల్లో అర్ధ శతకం బాది యువరాజ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. టీ20 చరిత్రలో ఇవే వేగవంతమైన అర్ధ శతకాలు. కాగా, 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

బిగ్ బాష్ టోర్నీలో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్.. అడిలైడ్ స్టైకర్స్పై ఈ ఘనత సాధించాడు. 17 బంతుల్లోనే 56(2ఫోర్లు, 7 సిక్స్లు)తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గేల్ రికార్డు స్కోరు చేసినప్పటికీ అతని జట్టు మాత్రం సోమవారం జరిగిన మ్యాచులో ఓటమి పాలైంది.
27 పరుగులతో ఓటమి పాలైన గేల్ జట్టు సెమీ ఫైనల్స్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.
కాగా, ఆస్ట్రేలియా జట్టుతో జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న 3అంతర్జాతీయ టీ20మ్యాచుల్లో పాల్గొనేందుకు యువరాజ్ సింగ్ ఈ రాత్రి ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నాడు. ఈ సందర్భంగా యూవీ తన ట్విట్టర్ ఖాతాలో.. గేల్, తన రికార్డును బ్రేక్ చేయకపోవడం వల్ల తాను అసంతృప్తికి లోనైనట్లు తెలిపాడు.
ఇది ఇలా ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబి విడిలియర్స్ పేరు మీదనే అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జనవరి 18, 2015న వెస్టిండీస్తో జరిగిన మ్యాచులో ఏబి ఈ ఘనతను సాధించాడు.
కాగా, 10 బంతుల్లోనే అర్ధ శతకం చేసి తన రికార్డును బ్రేక్ చేయాలన్న యువరాజ్ సింగ్ కోరికను ఏబి డివిలియర్స్ లేదా క్రిస్ గేల్ ఎవరు తీరుస్తారో వేచి చూడాలి.