

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ హైదరాబాద్లో సందడి చేశారు. తన స్పోర్ట్స్ బ్రాండ్ 'యూవీకెన్'ను పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ మాల్లో ఈ రోజు ప్రారంభించారు. నూతనంగా ఆధునీకరించిన మాల్లో యూవీకెన్ బ్రాండ్కు చెందిన స్పోర్ట్స్ దుస్తులు, టోపీలు, యాక్సెసరీలు, ఎక్యూప్మెంట్ తదితరాలతో కూడిన స్టోర్ను మంగళవారం సాయంత్రం యువరాజ్ సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి సహకారం కల్పించేందుకు యూవీకెన్ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే పేరుతో స్పోర్ట్స్ వస్త్రాల బ్రాండ్నూ ఏర్పాటుచేసి దాని ద్వారా వచ్చే లాభాలను ఫౌండేషన్ ద్వారా జరిగే సేవలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. యూవీకెన్ బ్రాండ్ స్టోర్లు అన్ని సెంట్రల్ మాల్స్లోనూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
యువరాజ్సింగ్ రాకతో సెంట్రల్ మాల్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. యువీ ఉన్నంతసేపు అతనినే ఫాలో అవుతూ సెల్ఫీలకోసం పోటీలు పడ్డారు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్లో యువరాజ్ సింగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు.దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ సినీ మహోత్సవం వారి చేతుల మీదుగా ఇటీవలే యువరాజ్ సింగ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అవార్డు అందుకున్నాడు.
2011వ సంవత్సరంలో ప్రపంచ కప్ విజేత అయిన టీమిండియాలో భాగమైన యువరాజ్ 2012వ సంవత్సరం కాన్సర్కు అమెరికాలో చికిత్స చేయించుకున్నాడు. క్యాన్సర్ను విజయవంతంగా ఎదుర్కొన్న యువరాజ్ క్యాన్సర్పై అవగాహన కోసం పలు సేవా కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నాడు. కాగా, మంగళవారం ప్రారంభించిన స్టోర్ కూడా క్యాన్సర్ బాధితుల సహాయార్థం నెలకొల్పబడిందే.