ఇండియాలో క్రేజ్ ఉన్న మతాలు రెండున్నాయి. అందులో ఒకటి క్రికెట్.. మరొకటి సినిమా. అయితే భారత క్రికెట్లో ఆటతో పాటు గాసిప్లకు కూడా కొదవలేదు. మరోవైపు క్రికెటర్లకు, సినీ తారల మధ్య డేటింగ్స్, అఫైర్ల విషయం కూడా కొత్తేమీ కాదు. బాలీవుడ్ హీరోయిన్లతో ఉన్న సంబంధాల వల్ల క్రికెటర్ల ఆటపై ప్రభావం చూపిందన్న ఆరోపణలు చాలానే వినిపించాయి. అయితే, వీటికి తగిన ఆధారాలులేవు కానీ, వీరి లవ్ స్టోరీలు మాత్రం బాలీవుడ్ క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచాయి. బాలీవుడ్ హీరోయిన్లతో క్రికెటర్ల ప్రేమాయణంపై రూమర్లు చాలా వచ్చాయి. ఈ కోవలోనే భారత క్రికెట్కు చెందిన దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ల పేర్లు బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో ముడిపడ్డాయి. దీపికా మ్యాచ్లు చూడటానికి స్టేడియానికి వచ్చినప్పుడల్లా ఈ పుకార్లకు మరింత బలం చేకూరేది.
ధోనీ, యువరాజ్ యుగం
అది 2007-2008 నాటి కాలం. భారత క్రికెట్ను ఇద్దరు స్టార్లు ఏలుతున్నారు. మొదట యువరాజ్ సింగ్, తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ. ఒకరు ఎడమచేతి వాటం స్టైలిష్ బ్యాటర్ అయితే.. మరొకరు 'కెప్టెన్ కూల్'. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు అంటే అభిమానులకు పిచ్చి. మైదానంలో ఈ స్టార్ ప్లేయర్లు ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే.. స్టాండ్స్లో కూర్చున్న బాలీవుడ్ 'శాంతి ప్రియ' (ఓం శాంతి ఓం ఫేమ్) దీపికా పదుకొణె వారిని ఉత్సాహపరిచేవారు.

యువీ మనసులో దీపిక!
దీపికా పదుకొణె తొలిసారిగా మ్యాచ్ చూడటానికి వచ్చి కెమెరా ఆమెపై ఫోకస్ అయినప్పుడు.. ఆ మ్యాచ్లో యువరాజ్ సింగ్ బ్యాట్ నుంచి పరుగులు జాలువారుతున్నాయి. యువీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మైదానంలో మెరుపులు మెరిపిస్తూనే.. తన మనసులో దీపికపై ప్రేమను పెంచుకున్నాడని పుకార్లు వచ్చాయి. ఓ పార్టీలో కలుసుకున్న దీపికా, యువీ మొదట స్నేహితులయ్యారని.. ఆ తర్వాత వారి బంధం స్నేహం కంటే ఎక్కువగా మారిందని పుకార్లు వచ్చాయి. వారి డేటింగ్ వార్తలు మీడియాలో వినిపించాయి.
కథలోకి ధోనీ ఎంట్రీ!
వార్తా ఛానెళ్లలో యువరాజ్ సింగ్, దీపికా పదుకొణె లవ్ స్టోరీలు నడుస్తున్న సమయంలోనే స్టోరీలోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ ఇచ్చారు. దీపికాతో నిజమైన కనెక్షన్ 'కెప్టెన్ కూల్' మాహికే ఉందని వార్తలు వచ్చాయి. కింగ్ఫిషర్ క్యాలెండర్ గర్ల్ , 'ఓం శాంతి ఓం' ఫేమ్ దీపికా విసిరిన 'ప్రేమ బంతికి' ధోనీ క్లీన్ బౌల్డ్ అయ్యారని అప్పట్లో అంతా అనుకున్నారు. ఆ తర్వాత కూడా దీపికా మ్యాచ్లు చూడటానికి వచ్చింది, కానీ ఈసారి యువరాజ్కు కాదు, ధోనీకి సపోర్ట్ చేయడానికి అంటూ వార్తలు వినిపించాయి. మైదానంలో దీపికా పదుకొణె కూర్చున్నప్పుడు కెమెరా ఆమెపై ఆగిందంటే.. కామెంటేటర్లు కూడా సిగ్గుపడేవారు. బిగ్ స్క్రీన్పై ఆమెను చూసిన ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో ఉప్పొంగేవారు.
తమ జీవితాల్లో ముందుకు సాగిపోయిన స్టార్స్!
అయితే ఈ లవ్ స్టోరీలన్నీ కేవలం వదంతులుగానే మిగిలిపోయాయి. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మాత్రం ఆ ముగ్గురికే తెలుసు. ఆ తర్వాత దీపికా జీవితంలోకి రణ్బీర్ కపూర్, ఆపై రణ్వీర్ సింగ్ వచ్చారు. రణ్వీర్, దీపికా వివాహం చేసుకుని ఇటీవల ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. మరోవైపు ధోనీ, యువీ కూడా తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారు. ధోనీ సాక్షిని వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కూతురు ఉంది. యువరాజ్ సింగ్ నటి హేజిల్ కీచ్ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.