భారత క్రికెట్ లోకంలో వివాదాలు కొత్తేమీ కాదు. తాజాగా మాజీ క్రికెటర్, స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. యువరాజ్ సింగ్కు టీమిండియాలో నిజమైన స్నేహితులు లేరని, సచిన్ టెండూల్కర్ మాత్రమే అతనికి అండగా నిలిచారని యోగరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు. యోగరాజ్ చేసిన వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపైనా ఉన్నాయి.
వెన్నుపోటు రాజకీయాలు
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ కేవలం సహచరులు మాత్రమేనని.. స్నేహితులు కాదని చెప్పారు. యువరాజ్ సింగ్కు నిజమైన స్నేహితుడని.. అతని వెన్నంటి నిలిచిన ఏకైక వ్యక్తి ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. మిగతా వారందరూ యువరాజ్ సింగ్కు వెన్నుపోటు పొడిచేవారేనని ఆరోపించారు. అంతే కాకుండా అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనితో సహా జట్టులో అందరూ యువరాజ్ సింగ్కు భయపడేవారని ఆయన వ్యాఖ్యానించారు.

ధోనీపై ఇప్పటికే విమర్శలు.. కొత్తగా కోహ్లీపై..
గతంలో కూడా యోగరాజ్ సింగ్ పలు సందర్భాల్లో ఎంఎస్ ధోనిపై తీవ్ర విమర్శలు చేశారు. యువరాజ్ సింగ్ను జట్టు నుంచి తప్పించడంలో ధోని కీలక పాత్ర పోషించారని గతంలో చాలా సార్లు ఆరోపించారు. అయితే ఈ సారి యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలు కేవలం ధోనీకే పరిమితం కాకుండా.. ప్రస్తుత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కూడా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి. యోగరాజ్ సింగ్ చేసిన ఈ ప్రకటనపై బీసీసీఐ లేదు మరే ఇతర ఆటగాడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే నెట్టింట యువరాజ్,కోహ్లీ, ధోనీ అభిమానుల మధ్య ఈ విషయంపై పెద్ద ఎత్తున వాగ్వాదాలు జరుగుతున్నాయి.