హైదరాబాద్: మూడేళ్ల సుదీర్ఘం విరామం తర్వాత ఇంగ్లాండ్ సిరిస్తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్కు సెలక్టర్ల నుంచి యువరాజ్ సింగ్ పిలుపొచ్చింది. భారత జట్టులో యువరాజ్ పునరాగమన చేసినా తండ్రి యోగిరాజ్ సింగ్ మాత్రం సంతోషంగా లేడని తెలుస్తోంది.
గతంలో పలుమార్లు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్పై బహిరంగంగానే విమర్శలు చేసిన యోగిరాజ్ తాజాగా మరోసారి విమర్శించాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలోనే తన కుమారుడు యువరాజ్కి భారత జట్టులో చోటు దక్కిందని అన్నాడు.
మహారాష్ట్ర టైమ్స్తో మాట్లాడిన యోగిరాజ్ ధోని కెప్టెన్సీ తప్పుకున్న తర్వాతే తన కుమారుడికి భారత జట్టులో చోటు లభిస్తుందని తాను రెండేళ్ల క్రితమే ఊహించానని తెలిపాడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా ధోనిపై యువీ తండ్రి విమర్శలు చేస్తుండటాన్ని గతంలో కూడా మనం చూశాం.
ఇదిలా ఉంటే 2013 డిసెంబర్లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుకు దూరంగానే ఉన్నాడు. గత ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్లోకి తీసుకెళ్లడంలో ముఖ్యభూమిక పోషించాడు.

అయినా సరే సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో 2016 17 రంజీ సీజన్లో ఆడిన యువరాజ్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. పంజాబ్ కెప్టెన్ గా 5 మ్యాచ్లు ఆడిన యువీ 84 సగటుతో 672 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు. అందుకే యూవీకి రెండు ఫార్మెట్లలో అవకాశం ఇచ్చామని తెలిపారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. దీంతో యువీకి భారత జట్టులో స్థానం కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ధోనీ ప్రకటించిన తర్వాత ఎంపిక చేసిన తొలి జట్టులోనే యువరాజ్కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో యువీ తండ్రి యోగిరాజ్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఏర్పడింది. అంతకముందు 2015 వరల్డ్ కప్ జట్టులో యువీని జట్టు నుంచి తప్పించడం వెనుక ధోనీ కుట్రనే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్కు యువరాజ్ సింగ్ ఎంపిక కాకపోవడం వెనుక కెప్టెన్ ధోని ప్రమేయం ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ధోని ఒత్తిడి కారణంగానే జాతీయ సెలక్టర్లు యువరాజ్ని ఎంపిక చేయలేదని అన్నారు. ధోనికి తన కుమారుడితో విబేధాలుంటే అందుకు తానేమీ చేయలేనని, ఆ దేవుడే చూసుకుంటాడని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.