ఇప్పటికే క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం యూసుఫ్ పఠాన్ కూడా సిద్ధంగా ఉన్నాడని సమాచారం. వచ్చే నెల 13, 14న బెంగళూరు వేదికగా జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో యూసుఫ్ పఠాన్ పాల్గొనున్నాడని తెలుస్తోంది. 39 ఏళ్ల యూసుఫ్ పఠాన్ 2019లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. కానీ యూసుఫ్ ప్రస్తుతం ఫామ్ పరంగా, ఫిట్నెస్ పరంగా మంచి స్థితిలో ఉన్నాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ ఆడే ఆలోచనలో ఈ మాజీ ఆల్రౌండర్ ఉన్నాడని సమాచారం. ఇందుకోసం వేలంలో పాల్గొనడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గురువారం లెజెండ్స్ లీగ్లో జరిగిన మ్యాచ్లో యూసుఫ్ పఠాన్ తన పాత ఆట తీరును కనబరుస్తూ చెలరేగాడు. దీంతో యూసుఫ్ ఈ ఏడాది ఐపీఎల్లో ఆడడం ఖాయమని తెలుస్తోంది. యూసుఫ్ను కొనుగోలు చేయడానికి పలు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయని సమాచారం.
లెజెండ్స్ లీగ్లో భాగంగా గురువారం ఆసియా లయన్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా మహారాజస్ తరఫున బరిలోకి దిగిన యూసుఫ్ పఠాన్ చెలరేగి ఆడాడు. 176 పరుగుల లక్ష్య చేధనలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇండియా మహారాజస్ కష్టాల్లో పడిన సమయంలో యూసుఫ్ క్రీజులోకి వచ్చాడు. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా విజయానికి చేరవ చేసి రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతులు ఎదుర్కొని 80 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 9 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. ఏకంగా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 5 సిక్స్లు, 4 ఫోర్లతో అంతకు ముందు 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పఠాన్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేయడం గమనార్హం. అంతేకాకుండా కెప్టెన్ మహ్మద్ కైఫ్తో కలిసి నాలుగో వికెట్కు 117 పరుగులు జోడించాడు.
ఐపీఎల్లో గతంలో యూసుఫ్ పఠాన్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. యూసుఫ్ ప్రాతినిధ్యం వహించిన జట్లలో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఐపీఎల్లో మొత్తంగా 174 మ్యాచ్లు ఆడిన యూసుఫ్ 29 సగటుతో 3204 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులు. ఈ క్రమంలో 262 ఫోర్లు, 158 సిక్స్లు బాదాడు.