టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బీసీసీఐ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన టీజర్ను బీసీసీఐ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. 'వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ.. గొప్ప క్రికెటింగ్ మైండ్స్ లోతుగా ఎలా ఆలోచిస్తాయో తెలుసుకోవడానికి వేచి ఉండండి. మునుపెన్నడూ లేని విధంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి ఫ్రీవిలింగ్ ఛాట్' అని బీసీసీఐ దానికి క్యాప్షన్ రాసుకొచ్చింది.
అయితే ఈ వీడియోలో గంభీర్, కోహ్లి ఆసక్తికర విషయాలు మాట్లాడారు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లి, గంభీర్ ఆడిన ఇన్నింగ్స్, టీమిండియా ట్రోఫీని అందుకోవడంతో వీడియో మొదలైంది. అనంతరం కోహ్లిని గంభీర్ ప్రశంసలతో ముంచెత్తాడు. 2012-13 ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్తో కోహ్లి గొప్ప క్రికెటర్గా ఎదిగాడని గంభీర్ అన్నాడు. తాను నేపియర్లో న్యూజిలాండ్ ఆడిన మ్యాచ్ కూడా తనని అదే జోన్లోకి తీసుకువచ్చిందని గౌతీ పేర్కొన్నాడు.

కాగా, ఈ క్రమంలో గంభీర్ను విరాట్ కోహ్లి ఓ ప్రశ్న అడిగాడు. 'మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ప్రత్యర్థితో మట్లాడాల్సి వచ్చినప్పుడు.. దాని వల్ల ఏకాగ్రత దెబ్బ తిని మీరు ఔట్ అవుతారనిపిస్తుందా? లేదా అది మిమ్మల్ని మరింత ప్రేరేపిస్తూ ఆడేలా చేస్తుందా?' అని కోహ్లి గంభీర్ను అడిగాడు. దానికి గంభీర్ ఇలా బదులిచ్చాడు. ''నా కంటే నువ్వే ఎక్కువ గొడవలు పడ్డావు. కాబట్టి దీనికి నా కంటే ఉత్తమంగా నువ్వే సమాధానం చెప్పగలవు'' అని గంభీర్ సమాధానమిచ్చాడు.
దీంతో కోహ్లి విరగబడి నవ్వాడు. ''ఈ విషయంలో నన్ను అర్థం చేసుకునే వాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను. ఇది చేయడం తప్పు కాదని, ఇలా జరుగుతుందని చెప్పే వాళ్ల కోసం ఎదురుచూశాను'' అని కోహ్లి సరదాగా అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. టీమిండియా తరఫున ఎన్నో విజయాలు గంభీర్, కోహ్లి కలిసి కీలక ప్రాత పోషించారు. మైదానంలో దూకుడుగా ఉండే ఈ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్లే.
కానీ ఐపీఎల్లో కోహ్లి, గంభీర్ గొడవపడని సందర్భాలూ ఉన్నాయి. ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. మ్యాచ్ ముగిసిన అనంతరం అప్పటి లక్నో జట్టు మెంటార్ గంభీర్, ఆర్సీబీ ప్లేయర్ కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఒకరిపైనొకరు దూసుకెళ్లారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి భారత్ విజయాలపై గురిపెట్టారు. రేపటి నుంచి బంగ్లాదేశ్ టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కోచ్గా బాధ్యతలు అందుకున్న గంభీర్కు ఇదే మొదటి టెస్టు సిరీస్.