క్రికెటర్లు ఛాన్స్ దొరికినప్పుడల్లా మైదానంలోకి దిగుతూనే ఉండాలి. లేదంటే వారి ఆటతీరు దెబ్బతింటుంది. అదే కొత్త కుర్రాళ్లకైతే ఆడే ప్రతి మ్యాచ్ ఒక అవకాశమే. తమ సత్తాను అందరికీ తెలిసేలా చేసే ఛాన్స్ అందరికీ దొరకదు కదా. దీనికి మంచి వేదిక దేశవాళీ టోర్నీలు. వీటిలో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు భారత జట్టులో కూడా చోటు దక్కే ఛాన్స్ ఉంది.
కానీ ఒకసారి భారత్కు ఆడిన తర్వాత చాలా మంది కుర్రాళ్లు దేశవాళీలకు నో చెప్పేస్తున్నారు. తాజాగా జార్ఖండ్ కుర్రాడు ఇషాన్ కిషన్ కూడా అదే పని చేశాడు. మరికొన్ని రోజుల్లో దులీప్ ట్రోఫీ మొదలవనుంది. దీనిలో ఈస్ట్ జోన్కు కెప్టెన్గా ఆడాలని కిషన్ను సెలెక్టర్లు కోరారట. అయితే తనకు ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడే ఆలోచన లేదని కిషన్ తేల్చిచెప్పేశాడట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదంటున్నారు.

ప్రస్తుతం కిషన్ ఎలాంటి గాయాలతో ఇబ్బంది పడటం లేదు. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియాలో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అయితే అతను ఈ మ్యాచ్లో ఆడలేదు. ఐపీఎల్ తర్వాత అతనికి క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలోనే జూన్ 28 నుంచి జులై 16 వరకు బెంగళూరులో జరిగే దులీప్ ట్రోఫీకి ఆడాలని అతన్ని సంప్రదించారట ఈస్ట్ జోన్ సెలెక్టర్లు.
కానీ కిషన్ దీనికి ఒప్పుకోలేదు. అయితే అతను ఇలా చేయడం వెనుక కూడా కారణం ఉందని కొందరు అంటున్నారు. ఐపీఎల్ తర్వాత పెద్దగా విశ్రాంతి లేకుండానే ఇంగ్లండ్ చేరుకున్న కిషన్.. వచ్చే నెలలో మొదలయ్యే వెస్టిండీస్ టూర్లో కచ్చితంగా ఆడతాడని తెలుస్తోంది. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరూ లేని తరుణంలో వికెట్ కీపర్ బాధ్యతలు అతనికే అప్పగించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ కోసం రెడీ అయ్యేందుకే కిషన్ దేశవాళీలకు నో చెప్పాడని సమాచారం.