ఇటీవలి కాలంలో అంపైర్లపై క్రికెటర్లు కోపం ప్రదర్శించడం మరీ ఎక్కువైంది. డీఆర్ఎస్ విధానం రావడంతో అంపైర్ల క్వాలిటీ తగ్గిన మాట వాస్తవమే.. అయితే అంపైర్ స్థానానికి కొద్దో గొప్పో గౌరవం ఇవ్వాలి. ఒకానొక సమయంలో 90ల్లో ఉన్నప్పుడు కూడా అంపైర్ అవుట్ అంటే చాలు.. సచిన్ వంటి వాళ్లు తాము నాటౌట్ అయినా మైదానం వీడే వాళ్లు.
ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ వంటి వాళ్లు అవుట్ ఇచ్చినందుకు వికెట్లు విరగ్గొడుతున్నారు. తాజాగా భారత యువ క్రికెటర్ బాబా అపరాజిత్ కూడా ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ డివిజన్-1 టోర్నమెంట్లో అపరాజిత్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో జాలీ రోవర్స్ సీసీ, యంగ్ స్టార్స్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్లో అపరాజిత్ను ఎల్బీడబ్ల్యూగా అంపైర్ ప్రకటించాడు. దీంతో చికాకు పడిన అపరాజిత్.. బంతి తన బ్యాటుకు తగిలిందంటూ గొడవకు దిగాడు. అంపైర్తోపాటు ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవ పడ్డాడు. ఈ వివాదం సద్దుమణిగేందుకు ఐదు నిమిషాలు పట్టింది. అప్పటికి కూడా అంపైర్ నిర్ణయంపై అసహనం ప్రకటిస్తూనే అతను మైదానం వీడటం గమనార్హం.
ఈ క్రమంలోనే ఈ నిర్ణయాన్ని ఎల్బీడబ్ల్యూ నుంచి క్యాచ్ అవుట్గా మార్చారు. యంగ్ స్టార్స్ ప్లేయర్ అపరాజిత్ వ్యక్తిగత స్కోరు 34 పరుగుల వద్ద ఈ ఘటన జరిగింది. జాలీ రోవర్స్ సీసీ కెప్టెన్ హరి నిషాంత్ వేసిన బంతి బాగా టర్న్ అయింది. దాన్ని లెగ్ సైడ్ ఆడేందుకు అపరాజిత్ ప్రయత్నించాడు. ఆ సమయంలో ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో ఉన్న ఫీల్డర్ ఆ బంతిని క్యాచ్ పట్టాడు.
ఈ డెలివరీని చూసిన జాలీ రోవర్స్ టీం వెంటనే అప్పీల్ చేశారు. అంపైర్ దీన్ని ఎల్బీడబ్ల్యూ అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయం విన్న అపరాజిత్ షాకయ్యాడు. అది అవుటెలా అవుతుందంటూ మండిపడ్డాడు. కానీ అంపైర్ కూడా వెనక్కు తగ్గలేదు. చివరకు దాన్ని క్యాచ్ అవుట్గా మార్చినా కూడా అపరాజిత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మైదానం వీడే సమయంలో కూడా అంపైర్లతో వాగ్వాదం కొనసాగించాడు.
మళ్లీ తిరిగొచ్చి ప్రత్యర్థి టీం సభ్యుడితో గొడవ పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే కలగజేసుకున్న అంపైర్లు ఇద్దరు ప్లేయర్లను విడదీశారు. యంగ్ స్టార్స్ జట్టు 32/2తో కష్టాల్లో ఉండగా అపరాజిత్ క్రీజులోకి వచ్చాయి. సాయి సుదర్శన్తో కలిసి మూడో వికెట్కు కీలకమైన 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో యంగ్ స్టార్స్ విజయం సాధించింది.