క్రికెట్ బోర్డులో రాజకీయాలు తట్టుకోలేక తను ఆటకు కొంతకాలం దూరం అవుతున్నట్లు ప్రకటించాడో స్టార్ క్రికెటర్. అతనెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ తరఫున రాణిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న యువ ఓపెనర్ ఉస్మాన్ ఘని. గత టీ20 వరల్డ్ కప్లో అతను ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ రెండింట్లో తను ఆడటం లేదని ప్రకటించాడు.
ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ)పై అసంతృప్తి ప్రకటించిన అతను.. ఈ కారణంగానే తను ఆట నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బంగ్లాదేశ్తో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ఆడిన సిరీసులో అతనికి చోటు దక్కలేదు. దీంతో ఏసీబీ అధికారులపై ఘనీ మండిపడ్డాడు. ఏ కారణంగా జట్టు నుంచి తప్పించారనే క్లారిటీ తనకు కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను మూడు ఫార్మాటకు దూరం చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు.

అయితే ఘనీకి ఏసీబీ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ క్రమంలోనే అతను షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. 'పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. క్రికెట్ బోర్డులో ఉన్న అవినీతి అధికారుల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నా. సరైన మేనేజ్మెంట్, న్యాయమైన సెలెక్షన్ కమిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటా' అని ఘనీ ట్వీట్ చేశాడు.
'అలా జరిగే వరకు కష్టపడుతూనే ఉంటా. ఈ మార్పులు జరిగిన మరుక్షణం మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఆడేందుకు ముందుకొస్తా. అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటా. నేను మళ్లీ దేశం తరఫున ఆడతాననే నమ్మకం నాకుంది. ఇప్పటికి చాలాసార్లు ఏసీబీ ఛైర్మన్ను కలిసేందుకు ప్రయత్నించా. కానీ ఎన్నిసార్లు వెళ్లినా ఆయన అందుబాటులో లేరనే అంటున్నారు. నన్ను టీం నుంచి ఎందుకు తప్పించారనే ప్రశ్నకు చీఫ్ సెలెక్టర్ కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు' అని ఘనీ వెల్లడించాడు.