హైదరాబాద్: లండన్ వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈసారి ఈ పోటీలకు భారత్ నుంచి 25 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి ఇంత మంది బరిలోకి దిగుతున్నప్పటికీ, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే భారత్ క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
హర్యానాకు చెందిన 19 ఏళ్ల నీరజ్ చోప్రా గతేడాది జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో రికార్డు ప్రదర్శనతో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. నీరజ్ కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆగస్టు 10న అర్హత రౌండ్ ఆడనున్న నీరజ్ చోప్రా దానిని అధిగమిస్తే 12న జరిగే ఫైనల్స్లో పోటీపడతాడు.
2003లో పారిస్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో లాంగ్జంపర్ అంజూ బాబీజార్జ్ సాధించిన కాంస్య పతకమే ఇప్పటి వరకు భారత్కు అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత మరే ఇతర అథ్లెట్ కూడా భారత్కు మరో పతకాన్ని సాధించలేకపోయారు.

ఇక ఇటీవల భువనేశ్వర్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో ఏ మేరకు వీరి ప్రదర్శన ఉంటుందనేది అనుమానంగా మారింది.
2015లో బీజింగ్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు 16 మంది వెళ్లినప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే ఇంద్ర జిత్ సింగ్ (షాట్ పుట్), వికాస్ గౌడ(డిస్కస్ త్రో), లలితా బాబర్ (హెప్టలాన్) ఫైనల్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి భారత్ నుంచి పెద్ద ఎత్తున అథ్లెట్లు లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు అర్హత సాధించారు. రిలే రన్నర్స్లో పూవమ్మ, జిస్నా మ్యాథ్యూ, అను రాఘవన్లు ఈసారి పతకాల బరిలో ఉన్నారు. భారత్ తొలి ప్రదర్శన ఆగస్టు 5న హెప్టలాన్ ఈవెంట్తో ప్రారంభం కానుంది.