ఐపీఎల్ 2024 వేలం ఎవరి ఊహలకు అందట్లేదు. ఫ్రాంచైజీలు అంచనాలకు భిన్నంగా ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు.ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. రూ 24.75 కోట్లకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. మరో ఆసీస్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ కూడా భారీ ధర పలికాడు. సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసింది.
అయితే అన్క్యాప్డ్ ప్లేయర్లు ఈ వేలంలో భారీ ధర పలికారు. సమీర్ రిజ్వి కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.8.4 కోట్లు వెచ్చించింది. కనీస ధర రూ.20 లక్షలతో వచ్చిన రిజ్వీ కోసం చెన్నైతో గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రిజ్వీని సీఎస్కే దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వి మంచి హిట్టర్. దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డు సొంతం. అతడిని 'రైట్ హ్యాండెడ్ సురేశ్ రైనా'గా పిలుస్తారు.

మరో అన్క్యాప్డ్ ప్లేయర్ శుభమ్ దూబె కూడా జాక్పాట్ కొట్టాడు. రూ. 20 లక్షల బేసిక్ ప్రైజ్తో వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ రూ. 5.8 కోట్లు కుమ్మరించింది. శుభమ్ కోసం రాజస్థాన్తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడింది. శుభమ్ దూబె ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తాచాటాడు. ఏడు మ్యాచ్ల్లో 73 సగటుతో 221 పరుగులు చేశాడు. 180కు పైగా స్ట్రైక్రేట్తో ఆడాడు.
సుపరిచితమైన మరో అన్క్యాప్డ్ ప్లేయర్ హిట్టర్ షారుఖ్ ఖాన్ వేలంలో రూ. 7.4 కోట్ల ధర పలికాడు. షారుఖ్ ఖాన్ కోసం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. అంతిమంగా వేలం రేసులో షారుఖ్ను గుజరాత్ దక్కించుకుంది. షారుఖ్ బేస్ ప్రైస్ రూ. 40 లక్షలు.
కుమార్ కుశాగ్రాకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే యంగ్ ప్లేయర్ యశ్ దయాల్ను బెంగళూరు రూ.5 కోట్లకు దక్కించుకుంది. సుశాంత్ మిశ్రాను రూ.2 కోట్లకు, పేసర్ కార్తిక్ త్యాగీని రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.