ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి ఢిల్లీలో ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ స్కోర్ ను అలవోకగా అందుకుంది. 81 బంతులు మిగిలి ఉండగానే దీన్ని ఛేదించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయం. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లల్లో ఆరింట్లో నెగ్గింది ఆర్సీబీ. మొత్తం 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ఒక్కడే టాప్ స్కోరర్. 33 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/5), జోష్ హేజిల్వుడ్ (4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించారు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్ధర్ సలామ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ (15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34 నాటౌట్) అజేయంగా నిలిచారు. జాకబ్ బెథెల్ 11 బంతుల్లో ఫోర్, రెండు సిక్స్లతో 20 పరుగులు చేశాడు.
కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హోటల్కు వచ్చినప్పుడు ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ పిల్లాడు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్ పట్టుకుని ఆనందంగా పరుగెత్తాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకోవడంతో కోహ్లీని కలవలేకపోయాడు. ఆ సమయంలో కోహ్లీ అక్కడే ఉన్నాడు గానీ పెద్దగా పట్టించుకోలేదు. హడావుడిగా వెళ్లిపోయాడు.
ఆటోగ్రాఫ్ కోసం ఆ పిల్లాడు కొంతదూరం పరుగెత్తాడు కూడా. అయినప్పటికీ ఉపయోం లేకుండాపోయింది. ఆ అభిమాని నిరాశతో వెనుదిరిగాడు. ఆటోగ్రాఫ్ దక్కలేదనే కారణంతో బ్యాట్ విసిరి వేస్తూ, గట్టిగా ఏడవటం ఇందులో చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.