
సొంత పిచ్లపై అసహనం:
ఢాకాలోని పిచ్లలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అయింది. టీ20 మ్యాచులు అయినా భారీ స్కోర్లు నమోదు కాలేదు. పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించింది. అందుకే ఇలాంటి పిచ్లపై బ్యాట్స్మెన్ వైఫల్యాలను అంచనా వేయరాదని షకీబ్ అల్ హసన్ అంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ కోసం షకీబ్ యూఏఈ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ 2021లపై కూడా స్పందించాడు.

కెరీర్లు ముగుస్తాయి:
'ఢాకాలోని పిచ్లలో గత 9-10 మ్యాచ్లు ఆడిన బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో లేరు. వికెట్ అలా ఉంది. ఎవరూ బాగా ఆడలేదు. పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించింది. బ్యాట్స్మెన్ల ఈ ప్రదర్శనను లెక్కించరని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా ఈ వికెట్లపై 10-15 మ్యాచ్లు ఆడితే కెరీర్లు ముగుస్తాయి. ముఖ్యంగా ఇలాంటి పిచ్లపై నిరంతరం ఆడితే.. యువ బ్యాట్స్మెన్ కెరీర్లు ప్రమాదంలో పడతాయి' అని బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో షకీబ్.. కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సెప్టెంబరు 19న ఆరంభం అయ్యే ఐపీఎల్ 2021 రెండో దశ కోసం షకీబ్ యూఏఈ చేరుకొని క్వారంటైన్ అయ్యాడు.

ఆ అనుభవాలను మా వారికి చెబుతాం:
ఐపీఎల్ 2021 ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ మొదలవనుంది. కాగా ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం ద్వారా పొందిన అనుభవాలను తనతో పాటు ముస్తాఫిజుర్ రెహ్మన్.. బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పంచుకుంటామని షకీబ్ హల్ హసన్ అన్నాడు. ఇలా చేయడం టీ20 ప్రపంచకప్లో తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. 'ఐపీఎల్ అందరికీ ఉపయోగపడుతుంది. మేం యూఏఈ వాతావరణ పరిస్థితుల్లో గడుపుతాం. ఐపీఎల్ మ్యాచ్లు ఆడతాం. ఆ అనుభవాలను మా జాతీయ జట్టు ఆటగాళ్లతో పంచుకుంటాం. ఇతర ఆటగాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటాం. టీ20 ప్రపంచకప్ గురించి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారనే విషయాలను మా ఆటగాళ్లకు చెప్తాం' అని షకీబ్ అన్నాడు.

ప్రపంచకప్ జట్టులో చోటు:
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021 కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్ను గతవారం (సెప్టెంబర్ 9) ప్రకటించిన విషయం తెల్సిందే. మహ్మదుల్లా కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో పాల్గొన్న ఆటగాళ్లకే బీసీబీ తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షీకీబ్ ఆల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్కు మాత్రం బీసీబీ మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న తమీమ్ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్ రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇటీవల ఆస్ట్రేలియాపై సౌమ్య సర్కార్ పేలవమైన ప్రదర్శన అతడి ఎంపికపై ప్రభావం చూపలేదు. అందుకు కారణం తమీమ్ ఇక్బాల్ అందుబాటులో లేకపోవడమే.

క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడనున్న బంగ్లా:
ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ .. తాజాగా కివీస్పై టీ20 సిరీస్ను గెలుచుకుంది. ఇదే ఫామ్ టీ20 ప్రపంచకప్ 2021లో కూడా కొనసాగించాలని చూస్తోంది. అయితే బంగ్లాదేశ్ సూపర్ 12లో ఎంటర్ కావాలంటే ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. క్వాలిఫయింగ్ దశలో గ్రూఫ్ బిలో బంగ్లాదేశ్తో పాటు స్కాట్లాండ్, పపువా న్యూ జినియా, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూఫ్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. ప్రస్తుత బంగ్లా ఫామ్ చూస్తే.. సూపర్ 12లోకి కచ్చితంగా రానుంది. అక్టోబర్ 17న స్కాట్లాండ్తో తమ తొలి మ్యాచ్లో బంగ్లా టీమ్ తలపడనుంది. ఈ మ్యాచ్తోనే టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది.

బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జట్టు:
మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్ ఉద్దీన్, షామిమ్ ఉద్దీన్.
స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్.


Click it and Unblock the Notifications












