
ఐపీఎల్ 2021 ఓ పీడకల:
కోల్కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఐపీఎల్ 2021 ఓ పీడకలలా మారింది. ఎందుకంటే.. ఐపీఎల్ 2021తొలి దశలో అతడికే మొదటగా కరోనా సోకింది. అతడి నుంచి వివిధ జట్లలో ఆటగాళ్లకు పాజిటివ్గా తేలడంతో మొత్తం లీగ్నే వాయిదా వేశారు. కరోనా సోకిన చాలా రోజుల తర్వాత కానీ వరుణ్ మహమ్మారి నుంచి కోలుకోలేదు. శారీరకంగా బలహీనంగా ఉండటంతో కోలుకోవడానికి అతడికి చాలా రోజులు పట్టాయి. ఇక ఆదివారం (అక్టోబరు 10) వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేకేఆర్ విడుదల చేసిన వీడియోలో.. ఆ చీకటి రోజులను వరుణ్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ 2021 నీ వల్లే ఆగిపోయిందని, నువ్ చచ్చిపోయుంటే బాగుండేదని పలువురు నెటిజన్లు పోస్టులు చేశారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

చచ్చిపోయుంటే బాగుండేది:
కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన వీడియోలో వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ... 'నాకు ఇంకా గుర్తుంది. డాక్టర్ శ్రీకాంత్ ఫోన్ చేసి నాకు కరోనా పాజిటివ్ అని చెప్పాడు. ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నేను వణికిపోయాను. అంతా నాశనం అయిపోయింది అనిపించింది. ఇంత జరుగుతుంది (సీజన్ వాయిదా) అని అప్పట్లో నేను ఊహించలేదు. ప్రజలు,నెటిజన్లు నాకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని మెసేజులు వచ్చాయి. అందులో కొన్ని దారుణమైన పోస్టులు ఉన్నాయి. కరోనా కన్నా వరుణ్ చక్రవర్తి మొత్తానికే చచ్చిపోయుంటే బాగుండేది అంటూ మెసేజ్లు పంపారు. అవి చూడగానే చాలా బాధపడ్డా. ఒక్కోసారి ఏడ్చేసేవాడిని' అని తెలిపాడు.

అలా ట్వీట్లు చేయడం తప్పే:
ఆ సమయంలో కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తికి మద్దతుగా నిలిచారు. 'సామాజిక మాధ్యమాలు కాస్త దయకలిగి ఉండాలని అనిపించింది. తమ మాటల ప్రభావం ఎంత ఉంటుందనేది ప్రజలు ఆలోచించరు. మీమ్స్, వీడియోలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ సమయంలో వారికి నచ్చింది మాత్రమే మాట్లాడతారు. అది చదువుతున్న మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది వారు ఏమాత్రం పట్టించుకోరు' అని కేకేఆర్ సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ దినేశ్ కార్తిక్ అన్నాడు. 'ఇది హాస్యాస్పదం. ఒకరిని నిందించాలని మీరు అనుకున్నారు. వరుణ్ లాంటి వ్యక్తి జీవితంలో చాలా సీరియస్గా ఉంటాడు. ఎపుడూ జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి వాడికి ఇలా జరగడం దురదృష్టకరం. సోషల్ మీడియాలో కొద్దిగా సానుభూతి అవసరమని భావిస్తున్నాను. ఆలా ట్వీట్లు చేయడం తప్పని నా అభిప్రాయం' అని నాయర్ పేర్కొన్నాడు.

అనుమానాలు నెలకొన్నా:
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడటంపై ఇటీవల పలు అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్లో ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్.. మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో మెగా టోర్నీలో అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ లేమితో బాధపడుతున్న వరుణ్ స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం అక్టోబర్ 10 వరకు మాత్రమే తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.


Click it and Unblock the Notifications












