నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు టీ20 సిరీస్ను టీమిండియా 1-1తో సమం చేసింది. అయితే ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్లో సంజు శాంసన్ (108; 114 బంతుల్లో) ఆట హైలైట్గా నిలిచింది. తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగుతున్న సంజు శాంసన్ అదరగొట్టాడు.
కెరీర్లో శాంసన్ తొలి సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ (52; 77 బంతుల్లో) కుదురుకోవడానికి ఎక్కువ బంతులు తీసుకోవడంతో ఓ స్థితిలో టీమిండియా రన్రేటు తగ్గింది. కానీ మరో ఎండ్లో ఉన్న శాంసన్ బౌండరీలతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అనంతరం అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటారు. సఫారీ జట్టు ఓపెనర్ టోనీ డిజోర్జి (81; 87 బంతుల్లో) పోరాడాడు. శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

అయితే సెంచరీ సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంలో సంజు శాంసన్ మాట్లాడాడు. ''సెంచరీ సాధించినందకు సంతోషంగా ఉంది. భావోద్వేగంగా అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డా. మొత్తానికి మంచి ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది. కొత్త బంతితో సౌతాఫ్రికా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. తర్వాత పాత బంతి టైమ్లో బ్యాటింగ్ చేయడం సవాలుగా మారింది. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత కేశవ్ మహరాజ్ ఊపందుకున్నాడు. కానీ నేను, తిలక్ కుదురుకోవడానికి ప్రయత్నించాం. జట్టులో ఎక్సట్రా ఆల్రౌండర్ ఉన్నాడని 40 ఓవర్లపాటు బ్యాటింగ్ కొనసాగించాలని మేం ప్లాన్ చేశాం''
'' విజయంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది. పిచ్, బౌలర్లను అర్థం చేసుకోవడానికి వన్డే ఫార్మాట్లో సమయం ఉంటుంది. ఇక టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం వల్ల మరో 10-20 బంతులు ఎక్కువగా ఆడే అవకాశం ఉంటుంది. తిలక్ వర్మ గొప్పగా ఆడాడు. అతడి ఆట పట్ల దేశం గర్వంగా ఉంది. తిలక్ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్లు సాధిస్తాడు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు నెలకొల్పిన ప్రమాణాలను జూనియర్లు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రయాణం చేస్తూ 2-3 రోజుల వ్యవధిలోనే మ్యాచ్లు ఆడటం అంత ఈజీ కాదు. అయినా సత్తాచాటుతున్నాం'' అని సంజు శాంసన్ అన్నాడు. ఈ మ్యాచ్లో సంజు వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు.