కేప్టౌన్ వేదికగా జరిగిన భారత్-దక్షిణాఫ్రికా టెస్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్గా రికార్డులకెక్కెంది. కేవలం ఒకటిన్నర రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం 106.2 ఓవర్లలోనే తేలింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. కేప్టౌన్లో భారత్కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
అయితే కేప్ టౌన్ పిచ్పై చర్చలు మొదలయ్యాయి. స్పిన్కు అనుకూలించే భారత్ పిచ్లపై ఇలానే ఒకటిన్నరోజులోనే ఫలితం వస్తే పరిస్థితులు మరోలా ఉండేవని టీమిండియా మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ కేప్ టౌన్ పిచ్పై ఇప్పుడు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) మాజీలు మాట్లాడరని మండిపడ్డారు. పేస్కు అనూలిస్తేనే అది మంచి పిచ్గా SENA భావిస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'' టెస్టు క్రికెట్ అంటే బ్యాటర్లకు పరీక్ష. ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అయితే ఫాస్ట్ బౌన్సీ పిచ్లపై పరుగులు చేయలేకపోతే అసలు వారు బ్యాట్స్మెన్ కాదంటూ SENA దేశాల్లో విమర్శలు చేస్తారు. అక్కడ మీడియా కూడా అలానే ఉంటుంది. అలాగే టర్నింగ్ పిచ్పై మీకు బ్యాటింగ్ చేయడం చేతకాకపోతే మీరు కూడా బ్యాటర్లు కాదంటాను. ఇలా చెప్పినందకు క్షమించండి. కానీ మీడియాలో దీని గురించి వాస్తవం మాట్లాడాలి. కానీ ఇంటర్వ్యూల్లో వారిని ఇబ్బంది పెట్టలేక విదేశీ బ్యాటర్ల సామర్థ్యాన్ని ఇక్కడ ఎవరూ ప్రశ్నించట్లేదు'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
భారత్లోని స్పిన్ పిచ్లపై వస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఘూటుగా స్పందించాడు.''కేప్ టౌన్లోని పిచ్ ఎలా కఠినంగా ప్రవర్తించిందో అందరూ చూశారు. భారత్కు వచ్చినప్పుడు అక్కడి పిచ్ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే.. ఇలాంటి పిచ్పై ఆడేందుకు మాకెలాంటి ఇబ్బంది ఉండదు.టెస్టు క్రికెట్ ఆడేందుకు మేం వచ్చాం. పరిస్థితులు సవాలుగా ఉన్నా ఎదుర్కోవాలి. కానీ భారత్లో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగితే అప్పుడందరూ పిచ్ గురించి మాట్లాడతారు. తొలి రోజు నుంచి బంతి సీమ్ అయితే పర్వాలేదు కానీ స్పిన్కు అనుకూలిస్తూ మాత్రం ఒప్పుకోరు'' అని రోహిత్ తెలిపాడు.